
ప్రైవేటు టూర్ ఆపరేటర్లపై ఆధారపడి కైలాస్-మానస్ సరోవర్ యాత్రకు వెళ్తున్న భారతీయ పౌరులను ఉద్దేశించి విదేశాంగ శాఖ అడ్వైజరీ చేసింది. ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతే భారత్ నుంచి బయల్దేరాలని సూచించింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన పర్మిట్, వీసాలు లేకుండా.. ప్రైవేటు టూర్ ఆపరేటర్లను నమ్మి వెళ్లి.. పలువురు భారతీయ యాత్రికులు నేపాల్లో చిక్కుకుపోయారు. సహాయం చేయాలంటూ వారి నుంచి అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి స్పందన వచ్చింది. యాత్ర ప్రారంభించడానికి ముందు టూర్ ఆపరేటర్ వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించింది.
నేపాల్లో చిక్కుకున్న భారతీయ యాత్రికులకు సహాయం చేయాలంటూ ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కేంద్రాన్ని నేపాల్, చైనాలోని భారత ఎంబసీలను ఎక్స్ వేదికగా కోరారు. 52 మంది భారత పౌరులు చిక్కుకున్నారని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించింది. కరోనాతో ఐదు సంవత్సరాలు ఈ యాత్రకు అంతరాయం ఏర్పడగా.. గత ఏడాదే పునఃప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 20న తొలిబ్యాచ్ నాథులా పాస్ మీదుగా చైనాలోకి ప్రవేశించింది.





