News

వెలుగులోకి ‘జంబూద్వీపం’ అరుదైన పటం

35views

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జ్ఞాన భారతం మిషన్’ కింద మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లాలో చరిత్ర, ప్రాచీన భారతీయ జ్ఞాన నిధి అసాధారణ రీతిలో వెలుగులోకి వస్తోంది. జిల్లాలోనివిభిన్న ప్రాచీన దేవాలయాలు, గ్రంథాలయాలు, వ్యక్తిగత సేకరణల నుండి శతాబ్దాల నాటి అరుదైన హస్తప్రతులు లభ్యమవుతున్నాయి. భవిష్యత్తులో నిపుణులు వీటిపై లోతైన అధ్యయనం చేయడానికి వీలుగా ఈ అమూల్యమైన హస్తప్రతులను వేగంగా డిజిటలైజేషన్ (ఆన్‌లైన్) చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 825 హస్తప్రతులను ఆన్‌లైన్ చేయగా, వాటిలో 234 హస్తప్రతులను ‘భారత జ్ఞాన మండపం’ అధికారికంగా ఆమోదించింది.

ప్రాచీన జైన భూగోళం, ‘జంబూద్వీపం’ అరుదైన పటం
ఈ మిషన్ కింద లభించిన అత్యంత ఆశ్చర్యకరమైన, చారిత్రాత్మక ఆవిష్కరణలలో ఒక పెద్ద చేతితో గీసిన పటం ఉంది. జ్ఞాన భారతం మిషన్ నోడల్ బృందం సభ్యుడు అనుపమ్ దీక్షిత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రాథమిక శాస్త్రీయ పరిశీలనలో ఈ చిత్రం ఒక ప్రాచీన జైన లేదా భారతీయ బ్రహ్మాండ విజ్ఞానానికి (Cosmology) సంబంధించిన హస్తలిఖిత పటంగా కనిపిస్తోంది. ఈ ప్రాచీన పటంలో కొన్ని అత్యంత ముఖ్యమైన, స్పష్టమైన పదాలను గుర్తించవచ్చు. భరత క్షేత్రం, ఐరావత క్షేత్రం, విదేహం, గంగ, సింధు, లవణ సముద్రం, మేరు (బహుశా పటం మధ్య భాగంలో ఉంది) వంటి పేర్లు జైన ఆగమాలు, ప్రాచీన జైన భూగోళంలో వివరించిన ‘జంబూద్వీప’ నిర్మాణంతో పూర్తిగా సరిపోలుతున్నాయి. చిత్రం కేంద్రంలో ఒక వృత్తాకార నిర్మాణం ఉంది, దాని చుట్టూ భారీ పర్వత శ్రేణులు, వివిధ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. వెలుపలి వైపు సముద్రం, ద్వీపాల పొరలు ఉన్నాయి. అంచులలో ప్రాచీన నదులు, ప్రాంతాల పేర్లు స్పష్టంగా రాసి ఉన్నాయి. ఇది త్రిలోకం లేదా లోక విజ్ఞానానికి సంబంధించిన అత్యంత అరుదైన జైన చిత్రపటం కావచ్చు.

ఎక్కడెక్కడ ఎన్ని హస్తప్రతులు లభించాయి?
టీకంగఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాలు, జైన దేవాలయాలు, ప్రబుద్ధ పౌరుల వ్యక్తిగత సేకరణల నుండి మొత్తం 825 హస్తప్రతులు, శిలాశాసనాలు లభించాయి. వీటిలో అత్యధికంగా మాఝ్ పంచాయతీ జైన దేవాలయం నుండి 247, బజార్ జైన దేవాలయం నుండి 141, ఖర్గాపూర్ జైన దేవాలయం నుండి 121, దరగువా జైన దేవాలయం నుండి 107 హస్తప్రతులు సేకరించారు. అలాగే జిల్లా గ్రంథాలయం (District Library) నుండి 75, కొత్త జైన దేవాలయం నుండి 62, అజనౌర్ జైన దేవాలయం నుండి 25, బడాగావ్ ఫలహోడీ జైన దేవాలయం నుండి 13 హస్తప్రతులు లభ్యమయ్యాయి. వీటితో పాటు సంజయ్ జైన్, అజిత్ శ్రీవాస్తవ, ఛత్రపాల్ సింగ్ సోలంకి, దుష్యంత్ ద్వివేది, శివరాజ్ సింగ్ శ్రీవాస్తవ వంటి పలువురు ప్రముఖుల వ్యక్తిగత సేకరణల నుండి 21 అరుదైన ప్రతులు దొరకగా, సునహరా చెరువు, మాడుమర్ ప్రాంతాల నుండి 3 అరుదైన ప్రాచీన శిలాశాసనాలు వెలుగులోకి వచ్చాయి.

దేవాలయంలో లభించిన జ్యోతిష్య గణన పుస్తకం, చెక్క ‘పాచిక’
ఈ ఆవిష్కరణలోని మరొక ముఖ్యమైన అంశాన్ని గ్రంథపాలకుడు (లైబ్రేరియన్) విజయ్ మెహ్రా వివరించారు. ఖర్గాపూర్ చారిత్రాత్మక జైన దేవాలయం నుండి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రాచీన పుస్తకం లభించింది. ఈ పుస్తకంతో పాటు ఒక ప్రాచీన చెక్క పాచికకూడా దొరికింది. లభించిన ఈ ప్రాచీన చెక్క పాచికపై కొన్ని ప్రత్యేక అంకెలు, ప్రాచీన అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.

ప్రాచీన కాలంలో మన మనీషులు, జ్యోతిష శాస్త్రవేత్తలు ఈ పాచిక సహాయంతో సంక్లిష్టమైన జ్యోతిష్య గణనలు చేసేవారని నిపుణులు భావిస్తున్నారు. ఈ పాచిక, పుస్తకాన్ని జాతీయ స్థాయి నిపుణులు సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత, ఈ విజ్ఞానం ఆధునిక జ్యోతిష్య శాస్త్రంలో ఒక విప్లవాత్మక మలుపుగా మారే అవకాశం ఉందని విజయ్ మెహ్రా పేర్కొన్నారు.

వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా లభించిన ఈ వివిధ రకాల హస్తప్రతులలో బ్రహ్మాండ విజ్ఞానంతో పాటు ప్రాచీన ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, మానవ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచే వివిధ దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలకు సంబంధించిన అత్యంత ఉపయోగకరమైన సమాచారం లభించింది. మన ప్రాచీన మనీషులు, ఋషులు, పండితులు భద్రపరిచిన ఈ సార్వత్రిక జ్ఞానం భవిష్యత్తులో కేవలం భారతదేశానికే కాకుండా యావత్ మానవాళి శేయస్సుకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు నమ్ముతున్నారు.