News

ఒవైసీపై కేసు నమోదు

793views

ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని ఓ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఓవైసీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలివ్వగా మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైంది. ఇటీవల ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కర్ణాటకలో జరిగిన ఓ సభలో ఓవైసీ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 153, 153(a), 117, 295-a, 120b కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

గతేడాది నవంబర్‌లో అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతోనూ గతంలో అసదుద్దీన్‌పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోనూ కేసు పెట్టారు.

గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పై కూడా ఇలాగే క్రిమినల్ కేసు నమోదైన సంగతి కూడా పాఠకులకు విదితమే. కరీంనగర్‌లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో.. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో ఐపీసీ సెక్షన్‌ 153(A), 153(B), 506 కింద కేసు నమోదైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.