
బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్, తీవ్ర వివాదాస్పదమైన ‘కాంతార’ మిమిక్రీ వివాదానికి ముగింపు పలికారు. కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలోని చాముండి కొండపై వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. గర్భగుడిలో అమ్మవారికి క్షమాపణలు తెలిపి, ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కు తీర్చుకున్నారు. దీంతో ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగింది.
కొన్ని నెలల క్రితం గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ వివాదం మొదలైంది. ‘కాంతార’ చిత్రంలోని పవిత్రమైన ‘దైవ’ పాత్రను రణ్వీర్ సింగ్ అగౌరవపరిచేలా అనుకరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నటుడు రిషబ్ శెట్టి వారించినా రణ్వీర్ తన మిమిక్రీని ఆపలేదని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టులో ఫిర్యాదు దాఖలు కాగా, న్యాయస్థానం రణ్వీర్ తీరును తప్పుబట్టింది. అయితే, రణ్వీర్ కోర్టుకు క్షమాపణ చెప్పడంతో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. నాలుగు వారాల్లోగా చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి క్షమాపణలు చెప్పాలనే షరతు విధించింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆలయానికి చేరుకున్న రణ్వీర్, పూజలతో తన మొక్కు తీర్చుకున్నారు.





