News

నిజమైన స్నేహితులెవరో తెలుసుకొనే సమయం ఆసన్నమైంది

612views

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ స్వాగతించే ఓ దేశం చూపండి అంటూ సవాల్‌ విసిరారు. సీఏఏపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎకనామిక్‌ టైమ్స్‌ నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో శనివారం జయశంకర్‌ మాట్లాడారు.

శరణార్థుల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో సీఏఏను తీసుకొచ్చామని జయశంకర్‌ వివరించారు. దీన్ని కొనియాడాల్సింది పోయి విమర్శలు చేయడం తగదన్నారు. ‘ప్రపంచంలో అందరినీ స్వాగతించే ఓ దేశం చూపండని ఎవర్నైనా అడిగితే ఏ ఒక్కరూ చూపలేరు” అని వ్యాఖ్యానించారు. దేశీయ ప్రయోజనాల కోసమే ఆర్‌సెప్‌ నుంచి బయటకొచ్చినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అంశంపై యూఎన్‌హెచ్‌ఆర్‌సీ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దాని గురించి మాట్లాడే ముందు ఆ అంశంపై గతంలో యూఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యవహరించిన తీరు ఓ సారి మననం చేసుకోవాలని జయశంకర్‌ సూచించారు. ప్రపంచంలో మన మిత్రులను కోల్పోతున్నామా? అన్న ప్రశ్నకు మన నిజమైన స్నేహితులెవరో తెలుసుకొనే సమయం ఆసన్నమైందంటూ జయశంకర్‌ సమాధానం ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.