కరోనావైరస్ (కొవిడ్-19) వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో దేశాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తులు కూడా కరచాలనం చేసేందుకు భయపడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ దీనిపై స్పందించారు. తమ దేశ ప్రజలందరు కరోనా వ్యాపించకుండా కరచాలనానికి బదులు నమస్తేను అలవాటు చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకొంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలందరు గ్రీటింగ్ అలవాట్లను మార్చుకోవాలి. షేక్హ్యాండ్కి బదులు నమస్తే చేయండి. ఇజ్రాయెల్లో కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నాం” అని తెలిపారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 15కు చేరింది.
గతంలో ఇదే తరహా అనుభవం జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్కు ఎదురైంది. ఓ సమావేశం సందర్భంగా మెర్కెల్ మంత్రివర్గ సహరుల్లో ఒకరు ఆమెతో కరచాలనం చేసేందుకు నిరాకరించిన వీడియో వైరల్ అయ్యింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా భయంతో తన ముఖాన్ని వారం రోజులుగా తాకడంలేదని వెల్లడించారు. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతరులకు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.