News

పాక్ పై బలూచ్ తొలి సముద్ర దాడి ముగ్గురు సైనికులు మృతి

44views

పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతూ, బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ  తొలిసారిగా సముద్ర దాడులకు తెగబడింది. గతంలో భూభాగంపైన మాత్రమే దాడులు చేసిన BLA, ఇప్పుడు ఏకంగా సముద్రంలోకి ప్రవేశించి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం కలకలం రేపింది. అరేబియన్ సీ తీరంలో, పాక్-ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని గ్వాదర్ జిల్లా, జివాని   ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

సముద్ర దాడుల వైపు BLA

ఈ ఘటన BLA చరిత్రలో “మొదటి సముద్ర దాడి” గా నమోదైంది. కేవలం రోడ్డు మార్గాల్లో సైనిక కాన్వాయ్‌లు, పోలీసు స్టేషన్లు, చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్  ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాదులు, ఇప్పుడు సముద్ర మార్గంలో కూడా దాడులు చేయగలమని నిరూపించడం పాకిస్తాన్ రక్షణ యంత్రాంగానికి పెను సవాలుగా మారింది. “భూమిపై ఆపరేషన్ల తర్వాత, సముద్ర సరిహద్దులను లక్ష్యంగా చేసుకోవడం మా కొత్త మిలిటరీ వ్యూహంలో భాగం” అని BLA బహిరంగంగానే ప్రకటించడం, వారు తమ కార్యకలాపాలను ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారో స్పష్టం చేస్తోంది.

CPEC ప్రాజెక్టులకు పెను ముప్పు

ఈ దాడికి గ్వాదర్ ప్రాంతం వేదిక కావడం అత్యంత కీలకమైన అంశం. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ లో గ్వాదర్ పోర్ట్ అత్యంత కీలకమైన కేంద్రం. ఈ ఓడరేవు ద్వారా చైనా తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తుండగా, బలూచ్ వేర్పాటువాదులు దీనిని స్థానిక వనరులను దోచుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు. సముద్రంలో కూడా తమ ఉనికిని చాటుకోవడం ద్వారా, CPEC ప్రాజెక్టులకు, ముఖ్యంగా సముద్ర వాణిజ్యానికి తాము ఎంతటి భద్రతా ముప్పును కలిగించగలమో BLA చాటిచెప్పింది.

మారుతున్న భద్రతా సమీకరణాలు

ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్‌లో భూభాగంపైనే నిఘా ఉంచింది. ఇప్పుడు సముద్ర తీరంలో, ముఖ్యంగా అంతర్జాతీయ జలాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను మెరుగుపరచడం పాక్ కు మరింత ఆర్థిక భారం కానుంది. ఈ ఘటన తర్వాత గ్వాదర్ తీర ప్రాంతంలో పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అదనపు బలగాలను మోహరించాయి. మరోవైపు గత కొన్ని నెలలుగా బలూచ్ తన దాడుల తీవ్రతను పెంచింది. ఇది కేవలం చిన్నపాటి తిరుగుబాటు మాత్రమే కాదని, BLA వ్యవస్థీకృతమైన సైనిక వ్యూహంతో కూడిన పోరాటమని విశ్లేషకులు భావిస్తున్నారు.