ArticlesNews

అన్న సమారాధనే దైవారాధన : సమర్ధ సద్గురు శ్రీ కాశి నాయన

107views

( జనవరి 15 – కాశినాయన జయంతి )

కాశినాయన నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలం, బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకి పుష్యమాసము అమావాస్య నాడు అంటే 1895 జనవరి 15న కాశిరెడ్డి గారు జన్మించారు. ఆయన అసలు పేరు మున్నల్లి కాశిరెడ్డి. ఆయనకి చిన్నతనం నుండి కూడా దైవభక్తి ఎక్కువగా ఉండేది. వేమూరి రామయ్య గారి వద్ద కాశి నాయన విద్యాభ్యాసం చేశారు. తనకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చదువు ఆపేసి కాశినాయన వ్యవసాయ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు కాశిరెడ్డి గారు వేప చెట్టు కింద కూర్చొని ఉండగా తనకి మనసులో ఏదో ఆలోచన కలిగి అలా నడుచుకుంటూ, సద్గురువును వెతుకుతూ ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామానికి చేరి శ్రీ అతిరాచ గురవయ్య స్వామి గారి వద్ద శిష్యునిగా చేరిరి.

శ్రీ అతిరాచ గురవయ్య స్వామి గారి వద్ద శాస్త్ర ధర్మాన్ని, లోకాచారాన్ని పాటించి కాశి నాయన పరిపూర్ణ స్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత గురువాజ్ఞ తీసుకుని నాయన గారు తపోయాత్రకు బయలుదేరారు. కాశీలో మూడు సంవత్సరాలు, గరుడాద్రిలో 12 సంవత్సరాలు ఉన్నారు. కాశీయాత్ర సందర్భంగా దారిలో ఉన్న అన్ని పుణ్య క్షేత్రములను దర్శించుకున్నారు. నాయన గారు మైసూరు, చిక్ మంగళూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మద్రాస్, బళ్లారి ఇంకా చాలా చోట్ల తిరిగారు.

అమ్మా.. అన్నం, ఆకలి అంటే మీకు ఆ స్థోమత లేకున్నా కనీసం గంజి అయినా పోయండి, పది మంది అన్నం ఒక్కరు తినకూడదు. నలుగురికి సరిపోయే అన్నం పది మంది పంచుకోవాలి అని కాశి నాయన అనేవారు. కాశీనాయన గారు ప్రత్యక్ష దైవ స్వరూపముగా బిడ్డల గడప గడపనూ సంచరిస్తూ శిధిలమైన దేవాలయ కట్టడములను జీర్ణోద్ధరణ గావించారు. ఆ క్షేత్రములలో మంచినీటి బోరులను, బావులను త్రవ్వించి వాటి ఆధారంగా అన్నదాన ఆశ్రమాలను నెలకొల్పారు.

కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం, పోరుమామిళ్ల దగ్గర లింగమయ్య కొండమీద లింగమయ్య కొండ ఆశ్రమం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యోగానందాశ్రమము, కోట గొట్ల నందు గని క్షేత్రంలో గని ఆశ్రమము, గంగన్న పల్లి మెట్ట ఆశ్రమము, గిద్దలూరు తాలూకా పుల్వల చెరువు గ్రామంలో కాలువ బుగ్గ ఆశ్రమము, సీతారామపురం ఆశ్రమము, నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఘటిక సిద్దేశ్వరం ఆశ్రమం, ఉదయగిరిలో లింగాల దొనలో అన్నదాన క్షేత్రములను నెలకొల్పారు. నేటికీ నిరంతరాయముగా అన్నదాన కార్యక్రమాల నిర్వహణ జరగడం కోసం పోషకులను నియమించారు. ఈ ఆశ్రమాలలో గోమాత ప్రాశస్త్యం తెలుపుతూ హైందవ సనాతన ధర్మానుసారం గో సంరక్షణను చక్కగా నిర్వర్తించి గోమాతా మహాత్మ్యమును వివరిస్తున్నారు.

కడప జిల్లాలో నల్లమల అడవులకు చివరి గ్రామమైన కాశినాయన మండలం, వరికుంట్ల గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ జ్యోతి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో 1995 డిసెంబరు 6వ తేదీన జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయులుగా కాశి నాయన కాలం చెందారు. కుల, మత, జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారి కడుపు నింపి, అర్హతను బట్టి అనుగ్రహించి, దుర్మార్గులను సైతం సన్మార్గులుగా, సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలసిన వాడు శ్రీ కాశినాయన. కాశి నాయన అందించిన సామాజిక సమరసతా సేవాస్ఫూర్తితో నేటికీ సుమారు 100 నిత్యాన్నదాన కేంద్రాలు నడుస్తున్నాయి. ఆధ్యాత్మికతను, అన్నప్రసాదమును ఏక కాలంలో అందించిన కాశి నాయన జీవితం సమరసతా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ ఆదర్శం.