
మహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న శిఖర్ శింగ్నాపూర్ అనే ప్రదేశంలో.. శివాజీ మహారాజ్ తల్లి అయిన జిజాబాయి, ఇస్లాంలోకి మారిన బాజాజీ నింబాల్కర్ ను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సంఘటన అతను బీజాపూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, 1651 సంవత్సరంలో జరిగింది. అనేక ఆధారాల ప్రకారం, భారత చరిత్రలో నమోదు చేయబడిన తొలి ‘తిరిగి మతం మార్పిడి’ (ఘర్వాప్సీ) కేసులలో ఇది మొదటిది.
దీని ద్వారా మనలో కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి : రాజమాత జిజాబాయి ఇందులో ఎందుకు జోక్యం చేసుకున్నారు? బాబాజీ నింబాల్కర్ ఎవరు? మరియు అతను తిరిగి మతంలోకి మారడానికి దారితీసిన సంఘటనలు ఏమిటి?
ఆ కఠినమైన నియమం
17వ శతాబ్దం మధ్యలో, ఇస్లామిక్ ఆక్రమణదారుల కారణంగా దక్కన్లో రాజకీయ అల్లకల్లోలం ఏర్పడినప్పుడు.. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నప్పుడు, జిజాబాయి మరియు ఛత్రపతి శివాజీ మరాఠా కుటుంబంలో ఒక బాధాకరమైన పరిస్థితి ఏర్పడింది. శివాజీ మొదటి భార్య అయిన సాయిబాయి సోదరుడు బాజాజీ నింబాల్కర్ను, అదిల్షాహీ సైనికులు పట్టుకుని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు.
అది 17వ శతాబ్దం నాటి సమాజం. ఆ రోజుల్లో ఎవరైనా మతం మారితే, అది శాశ్వతమని సమాజం బలంగా నమ్మేది. మతం మారిన వ్యక్తిని ‘ఆధ్యాత్మికంగా బహిష్కరించబడినట్లు’ భావించేవారు. అంటే, వారికి సమాజంలో తిరిగి చోటు ఉండదని బలంగా నమ్మేవారు. మతపరమైన హద్దులు దాటిన ఎవరూ తిరిగి హిందూ మతంలోకి రాలేరని సాంప్రదాయ ఆచారం చాలా కఠినంగా ఉండేది.
బాజాజీ నింబాల్కర్ మతమార్పిడి వార్త తెలిసినప్పుడు.. ఒక కుటుంబ పెద్దగా మరియు సామ్రాజ్యానికి వెనుక ఉన్న శక్తిగా రాజమాత జిజాబాయి తీవ్రంగా బాధపడ్డారు. బలవంతంగా చేసే అలాంటి మత మార్పిడుల వెనుక ఉన్న మానసిక సంఘర్షణను.. ఆమె అర్థం చేసుకున్నారు. బలవంతపు మత మార్పిడి అనేది హిందూ ఉన్నతాధికారుల ధైర్యాన్ని దెబ్బతీయడానికి, ఇంకా సాధారణ ప్రజలైన గ్రామస్తులలో భయాన్ని సృష్టించడానికి శత్రువులు ఉపయోగించే ఒక ఆయుధం అని ఆమె గుర్తించారు. బాజాజీ లాంటి ఉన్నత అధికారిని కూడా శత్రువులు తీసుకుపోగలిగితే.. అది మరాఠా సామ్రాజ్యం అంతటా నిస్సహాయతను సృష్టిస్తుందని జిజాబాయి లోతుగా ఆలోచించారు.
ఆ పరిస్థితిలో జిజాబాయి చేసిన పనిని ఎవరూ ఊహించలేదు. ఆమె వెంటనే తన కుమారుడు, శివాజీ మహారాజ్తో మాట్లాడి, బలవంతంగా మతం మార్చబడిన హిందువును తిరిగి తమ మతంలోకి తీసుకోవడం ఎలా అనే ఆలోచన మొదలుపెట్టారు. తమ సమాజానికి చెందిన ప్రజలను తిరిగి స్వీకరించడానికి ధైర్యం చూపించాలని ఆమె గట్టిగా వాదించారు. ఆమె వాదన, తిరిగి మతం మార్పిడిని అంగీకరించని, శతాబ్దాల నాటి కఠినమైన పాత ఆచారాలు మరియు సంప్రదాయవాద పద్ధతులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మొత్తానికి, పాత కట్టుబాట్లను పక్కన పెట్టి, బలవంతంగా దూరం చేయబడిన తమ వ్యక్తిని తిరిగి రక్షించుకోవడానికి జిజాబాయి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
బాజాజీని తిరిగి సొంతింటికి తీసుకురావడానికి నిర్ణయం జరిగింది. సుమారు 1651లో.. నింబాల్కర్ కుటుంబానికి పవిత్రమైన, జిజాబాయికి ముఖ్యమైన శిఖర్ శింగ్నాపూర్ దేవాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక శుద్ధి కార్యక్రమం నిర్వహించబడింది. మత సంప్రదాయవాదుల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి, చాలా మంది బ్రాహ్మణ పూజారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిరాకరించారు. అయితే, కొంతమంది సంస్కరణ భావాలు ఉన్న పండితులు, పూజారులు ముందుకు వచ్చి ఈ వేడుకను పూర్తి చేశారు. ఈ వేడుక ద్వారా బాజాజీని హిందూ సమాజంలోకి ఒక గుర్తుగా తిరిగి తీసుకున్నారు. ఇది మరాఠా చరిత్రలో నమోదైన మొట్టమొదటి తిరిగి మతంలోకి తీసుకునే కేసులలో (First recorded reconversion case) ఒకటిగా నిలిచింది.
జిజాబాయి నెలకొల్పిన ఈ పద్ధతి, శివాజీ స్థాపించిన తొలి స్వరాజ్యంలో ఒక ముఖ్య సూత్రంగా మారింది. చాలా సంవత్సరాల తర్వాత, శివాజీ ముఖ్య సేనాధిపతులలో ఒకరైన నేతాజీ పాల్కర్ను మొఘల్ సామ్రాజ్యం బలవంతంగా మతం మార్చినప్పుడు, శివాజీ ఇదే సూత్రాన్ని అనుసరించారు. నేతాజీని పూర్తి గౌరవంతో తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించారు. ఈ ధైర్యవంతమైన సంస్కరణతో, జిజాబాయి మరాఠా రాజ్యం యొక్క నైతిక మరియు సామాజిక పునాదిని మార్చారు. ఆలయాల పునరుద్ధరణ, సంప్రదాయ కళలు మరియు హిందూ ఉత్సవాలను తిరిగి ప్రారంభించడంతో పాటు, మన సొంత ప్రజలను తిరిగి అంగీకరించే విషయంలో జిజాబాయి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.





