
భద్రాద్రిలో భక్త రామదాసు జయంత్యుత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తరామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న 387వ జయంతిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన నవరత్న కీర్తనలతో భద్రాచలం పుణ్యక్షేత్రం పులకరించింది. రామదాసు జయంత్యుత్సవాల సందర్భంగా ముందుగా గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో రామదాసు విగ్రహానికి పంచామృతాభిషేకం గావించారు.

అనంతరం మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తరామదాసు చిత్రపటంతో కన్నుల పండువగా శోభాయాత్ర నిర్వహించారు. ఆలయ సమీపంలోని చిత్రకూట మండపంలో భక్తరామదాసు వాగ్గేయకారోత్సవాలను దేవస్థానం ఈఓ గదరాజు నర్సింహులు, పెన్నా సిమెంట్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మల్లాది బ్రదర్స్ పర్యవేక్షణలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది సంగీత కళాకారులు భక్తరామదాసుకు నవరత్న కీర్తనలతో నీరాజనం పలికారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. రామదాసు జన్మస్థలమైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జయంత్యుత్సవాలను మూడురోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన 725 కేజీలతో కూడిన 11 అడుగుల భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు.





