News

కశ్మీర్‌లో పట్టుబడిన చైనా జాతీయుడు.. ఫోన్‌ హిస్టరీలో షాకింగ్ సమాచారం!

161views

కశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఓ చైనా జాతీయుడిని గుర్తించారు. 29 ఏళ్ల చైనా జాతీయుడిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యక్తిని హు కాంగ్టైగా గుర్తించారు. నవంబర్ 19న పర్యాటక వీసాపై ఢిల్లీకి వచ్చిన ఇతడు.. వీసా వారణాసి, సారనాథ్, గయ, కుషినగర్, ఆగ్రా, జైపూర్, ఢిల్లీ బౌద్ధ యాత్రా స్థలాలను సందర్శించడానికి వీసా పొందాడు.. అయితే.. వీసా నిబంధనలు అతిక్రమించి కశ్మీర్‌కి చేరుకున్నాడు. నవంబర్ 20న ఢిల్లీ నుంచి లేహ్‌కు విమానంలో ప్రయాణించి నేరుగా లడఖ్ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం.. ఏ విదేశీయుడైనా లేహ్ విమానాశ్రయంలోని FRRO కౌంటర్‌లో నమోదు చేసుకోవాలి.. కానీ ఈ నిబంధనను అతిక్రమించాడు. జాంస్కర్, పరిసర ప్రాంతాలను అన్వేషించడానికి ఇక్కడే మూడు రోజులు గడిపాడు.

హు కాంగ్టై పట్టుకుని దర్యాప్తు చేసిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఫోన్ హిస్టారీ తనిఖీ చేయగా.. ఒక ప్రధాన విషయం బయటపడింది. హు కాంగ్టై CRPF మోహరింపులు, కశ్మీర్‌లోని సున్నితమైన ప్రాంతాలు, ఆర్టికల్ 370కి సంబంధించిన సమాచారం కోసం ఇంటర్‌నెట్‌లో వెతికాడు. బహిరంగ మార్కెట్ నుంచి భారతీయ సిమ్ కార్డును కూడా కొనుగోలు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధం.. శ్రీనగర్‌లో ఒక రిజిస్టర్డ్ కాని గెస్ట్ హౌస్‌లో బస చేసి, నగరంలోని అనేక ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించాడు. శంకరాచార్య కొండ, హజ్రత్‌బాల్, దాల్ సరస్సు ప్రాంతం, మొఘల్ గార్డెన్స్ లో తిరిగాడు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. గత సంవత్సరం లష్కర్ ఉగ్రవాదితో కాల్పులు జరిగిన హర్వాన్‌లోని ఒక బౌద్ధ స్థలాన్ని హు కాంగ్టై సందర్శించారు. ఆర్మీ విక్టర్ ఫోర్స్ సమీపంలో ఉన్న అవంతిపూర్ శిథిలాలను సైతం చుట్టొచ్చాడు. నిందితుడు వీసా ఉల్లంఘనకు పాల్పడ్డాడని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.