News

‘‘జిహాద్’’ చేయాల్సి రావచ్చు.. పార్లమెంట్ సాక్షిగా ఎస్పీ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

160views

ఇటీవల జమాత్ చీఫ్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీ ‘‘జిహాద్’’ గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ మొహిబ్బుల్లా నద్వీ కూడా చేరారు. సాక్షాత్తు పార్లమెంట్ వేదికగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. రాంపూర్‌ ఎంపీగా ఉన్న నద్దీ మాట్లాడుతూ.. ‘‘ముస్లింలపై ఇలాగే అణచివేత కొనసాగితే, మేము జిహాద్ చేయాల్సి రావచ్చు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది.

ఎస్పీ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అఖిలేష్ యాదవ్ పార్టీ రాజ్యాంగం, బీఆర్ అంబేద్కర్ సూత్రాలపై నేరుగా దాడి చేస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. నద్వీ వ్యాఖ్యల ఉగ్రవాద దాడులను సమర్థించే వ్యాఖ్యలని విమర్శించారు. గతంలో మతగురువు అర్షద్ మదానీ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. చిదంబరం, హుస్సేన్ దల్వాయి, కాంగ్రెస్ ఎకో సిస్టమ్ తర్వాత, ఇప్పుడు ఎస్పీ జిహాద్‌ను చట్టబద్ధం చేస్తోందా? అని ప్రశ్నించారు.

వక్ఫ్ చట్టంపై ఎస్పీ ఎంపీ అభ్యంతరాలను పూనావాలా ప్రశ్నించారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు రెండూ ఈ చట్టాన్ని సమర్థిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టాన్ని పార్లమెంట్, సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చాయని, కానీ ఎస్పీ దీనికి వ్యతిరేకంగా జిహాద్ చేయాలనుకుంటోందా.? అని బీజేపీ పూనావాలా అన్నారు. మరో బీజేపీ నేత ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. నద్వీ వ్యాఖ్యలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలని ఆరోపించారు.