ArticlesNews

నవంబరు 26 భారత రాజ్యాంగ దినోత్సవం : భారతీయ ఆత్మ

165views

( నవంబరు 26 – భారత రాజ్యాంగ దినోత్సవం )

వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. అందువల్లనే స్వతంత్ర భారతంలో రూపుదిద్దుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ విలువలను ఇమిడ్చారు. ప్రజాస్వామిక, సహనశీల హిందుత్వ విలువలే ఈ దేశపు భిన్నత్వాన్ని కాపాడి ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థను ఏర్పరచగలవని వారు నమ్మారు.

హిందువులు అధికసంఖ్యాకులుగా ఉన్నా ఇతర మతాలవారి హక్కులకు ఎలాంటి ముప్పు ఏర్పడదని విశ్వసించారు. అందుకనే రాజ్యాంగంలో ఎక్కడా ‘సెక్యులర్‌’ అనే పదాన్ని చేర్చలేదు, వాడలేదు. 1977 ఇందిరాగాంధీ కాలంలో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్‌, సోషలిస్ట్‌ అనే రెండుపదాల్ని మూల పీఠికలో చేర్చారు. అప్పటి వరకు ఆ పదాలు రాజ్యాంగంలో లేవు.

రాజ్యాంగంలో ఇరవై రెండు రేఖా చిత్రాలు ఉన్నాయి. వాటి జాబితాను చూస్తే ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి. మొహంజొదారో ముద్ర, వైదిక ఆశ్రమం (గురుకులం), లంకపై రాముని యుద్ధం, గీతోపదేశం, బుద్ధభగవానుడు, మహావీరుడు, ధర్మప్రచారం, హనుమంతుడు, విక్రమాదిత్యుని ఆస్థానం, నలందా విశ్వ విద్యాలయం, ఒరిస్సాకు చెందిన శిల్పం, నటరాజ విగ్రహం, గంగావతరణ దృశ్యం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువల్ని ప్రతిబింబించే చిత్రాలే. ఇవన్నీ దుష్టశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సేవాభావం, మానవత్వం, జ్ఞానం, ధర్మపరాయణత్వం వంటి హిందూ జీవన విలువల్ని చూపుతాయి. మధ్యయుగానికి ప్రతీకగా ఒరిస్సాకు చెందిన హిందూ శిల్పం, నటరాజ విగ్రహం, భగీరధుని తపస్సు, గంగావతరణాల చిత్రాలు తీసుకున్నారు. అంటే అప్పటి వరకు హిందూ పరంపర, సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగాయని రాజ్యాంగకర్తలు గుర్తించారు. ఆ తరువాత యుగం ఈ అవిచ్ఛిన్న పరంపరను అడ్డుకుందని కూడా వాళ్ళు సూచించారు.

ఈ సాంస్కృతిక భావనే వివిధ రాజ్యాంగపు గుర్తులు, ప్రభుత్వ సంస్థల ఆదర్శ వాక్యాలలోనూ కనిపిస్తుంది. పార్లమెంటులో స్పీకర్‌ కుర్చీకి పైన ‘ధర్మచక్ర ప్రవర్తనాయ’ అని చెక్కి ఉంటుంది. ‘ధర్మ’ భావన హిందూ సంస్కృతిలో తప్ప మరెక్కడా కనిపించదు. రాజ్యాంగాన్ని పాశ్చాత్య దేశాల బహుమతిగా లేదా పాశ్చాత్య దేశాల మెరుగైన విలువలను ఎగుమతి చేయడమేనని భావించే వాదనలను మనం తిప్పికొట్టి ఓడించాలి. ఆంగ్ల భాష వాడకం మరియు సులభంగా అర్థం చేసుకోవడం వల్లనే మనం ‘రాజ్యాంగం’ అనే పదాన్ని ఉపయోగించాము, కానీ హిందీ పదం ‘సంవిధాన్’ దానిని సముచితంగా స్పష్టం చేస్తుంది. పాలన యొక్క ప్రాథమిక పత్రంగా రాజ్యాంగం అనే ఆలోచన ఎగుమతి చేయబడిన ఆలోచన కాదని, మన గొప్ప చరిత్ర ఆధారంగా రూపొందించబడిన భారతీయ ఆలోచన అని మనం గట్టిగా నొక్కి చెప్పాలి.

మన రాజ్యాంగాన్ని మన గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు నైతికతలో పాతుకుపోయిన విధంగా మరియు కొత్త సవాళ్లు మరియు అవకాశాల వైపు ముందుకు చూసే విధంగా అర్థం చేసుకోవడానికి మనం పూర్తి ప్రయత్నం చేయాలి. వలసవాద మనస్తత్వం, పశ్చిమ దేశాల గుడ్డి అనుకరణ మరియు పశ్చిమ దేశాల పట్ల అనుగుణ్యతా దృక్పథం ద్వారా నడిచే వివరణలు మరియు విశ్లేషణల నుండి రాజ్యాంగాన్ని విముక్తి చేయవలసిన అవసరం ఉంది.