
భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమపై తప్పుడు ఆరోపణలు చేయడం పాక్కు అలవాటుగా మారిందని మండిపడింది. కశ్మీర్ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్రదర్శిస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్ నాయుడు ఆరోపించారు. ‘ఎప్పటి మాదిరిగానే ఒక ప్రతినిధి బృందం మాపై విద్వేషపూరితమైన ఆరోపణలు చేస్తుంది. ప్రతీసారి ఆ ప్రతినిధి ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషాన్ని చిమ్ముతున్నారు. పాక్ చెబుతున్న అబద్ధాలను వినేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరనే విషయాన్ని ఆ దేశం గ్రహించాల్సిన అవసరం ఉంది’ అని నాయుడు హితవు పలికారు.
ఐరాస జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సెషన్లో ఆయన మాట్లాడుతూ పాక్ తీరును దుయ్యబట్టారు. మైనార్టీలను సర్వనాశనం చేస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని నాయుడు అన్నారు. జమ్ముకశ్మీర్ అంశాన్ని పాక్ కౌన్సిలర్ సయీద్ అహ్మద్ లేవనెత్తడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఐరాస భద్రతా మండలిలో చైనా పాకిస్థాన్కువంత పాడుతూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. దీనిపై చర్చకు సభ్యదేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది భారత్ ద్వైపాక్షిక అంశమని ఆయా దేశాలు స్పష్టం చేశాయి. గతేడాది ఆగస్టులోను చైనా ఇటువంటి ప్రయత్నమే చేయగా అది విఫలమైంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





