News

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

195views

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోను మంగళవారం లొంగిపోయాడు. 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ ధ్రువీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని హర్షిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. నక్సలిజం అంతం కావాలని బస్తర్‌ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఈ ఏడాది సెప్టెంబరులో మల్లోజుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ కూడా మద్దతిచ్చింది. అయితే, మల్లోజుల లేఖను హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం అతడు మరో లేఖ విడుదల చేశాడు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని అందులో పేర్కొన్నాడు.

‘‘ఇంత నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం నేను అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యం చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదు’’ అని మల్లోజుల తన లేఖలో తెలిపాడు.