
కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా కేంద్రం పలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ పశ్చిమబెంగాల్లో హింసాత్మకంగా మారింది.
బెంగాల్లోని మాల్దా జిల్లాలో నిరసనకు దిగిన ఆందోళనకారులు జాతీయ రహదారిని నిర్బంధించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. నాటు బాంబులు విసిరారు. పోలీసు వాహనాలు, బస్సులకు నిప్పంటించారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.
బెంగాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ బంద్ ఉద్రిక్తంగా మారింది. రైల్వే ట్రాక్లపై నిరసనలకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూచ్ బెహార్లో ప్రభుత్వ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కోల్కతాలో వామపక్షాలు, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఓ రైల్వే ట్రాక్పై పోలీసులు నాటు బాంబులు గుర్తించారు. బంద్ కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





