
తమిళనాడులోని మధురై నగరంలో నగరంలో ప్రముఖ మీనాక్షి అమ్మన్ ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఆలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముఖ్యంగా పరీక్షల సెలవులు, ప్రదోషం రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్న సమయంలో ఈ వార్త కలకలం సృష్టించింది.
అయితే మధురై సిటీ బాంబ్ డిస్పోజల్ యూనిట్ పోలీసులు, స్నిఫర్ డాగ్స్తో కలిసి ఆలయంలోని అమ్మన్, స్వామి గర్భాలయాల నుంచి బంగారు ధ్వజస్తంభం, అన్నదానం హాల్, తెప్పకుళం వరకు ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టారు. నాలుగు గోపురాల ద్వారాలు, భక్తులు తమ వస్తువులను ఉంచే కౌంటర్లు, పరిసర కొబ్బరికాయల స్టాళ్ల వద్ద సైతం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ నిశిత శోధన అనంతరం, ఆలయంలో ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ కేవలం తప్పుడు బెదిరింపు అని నిర్ధారణ కావడంతో పోలీసులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.





