
ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఆన్లైన్ పూజల పేరిట భక్తులను మోసం చేస్తున్న ఓ నకిలీ వెబ్సైట్ను పోలీసులు గుర్తించారు. శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు, దర్శనం, నైవేద్య సమర్పణ తదితర సేవలు అందిస్తామంటూ తప్పుడు ప్రకటనలతో ఆ వెబ్సైట్ రూ.వేలల్లో దోపిడికి పాల్పడుతోందని పూరీ ఎస్పీ ప్రతీక్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం గుట్టు రట్టు కావడంతో.. సైబర్ బృందాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఆ వెబ్సైట్ను బ్లాక్ చేసి, కేసు దర్యాప్తునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
‘‘జగన్నాథుని దర్శనం, ప్రత్యేక పూజలు తదితర సేవలు అందిస్తామంటూ తప్పుడు ప్రకటనలు ఇచ్చే నకిలీ వెబ్సైట్లకు భక్తులు దూరంగా ఉండాలి. మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. ఆలయ యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించే ఛానెళ్ల ద్వారా సేవలను ధ్రువీకరించుకోవాలి. అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా ఆన్లైన్లో హోటళ్లను బుక్ చేసుకునే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. డబ్బుల కోసం భక్తుల మనోభావాలతో ఆడుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ హెచ్చరించారు. – ఈటీవీ భారత్





