
పాకిస్థాన్కు సున్నితమైన సమాచారం చేరవేస్తూ దొరికిపోయిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్కు పెద్దసంఖ్యలో మన సైన్యం, పారామిలటరీ, ప్రభుత్వ అధికారులతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ఫోన్లో 15 మంది నంబర్లను దర్యాప్తు బృందం గుర్తించిందని ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. వీరిలో నలుగురు ఆర్మీ, నలుగురు పారామిలటరీ సిబ్బంది కాగా.. మిగిలినవారు ప్రభుత్వ అధికారులుగా తేలారు. జాట్ను మే 27న ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దర్యాప్తు బృందాలు ప్రస్తుతం జాట్ ఫోన్ను విశ్లేషిస్తున్నాయి. దీనినుంచి అతడు ఇంటర్నెట్ కాల్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అతడు పాకిస్థాన్లో సలీం అనే ఆపరేటివ్తో టచ్లో ఉన్నాడు. జాట్తో మాట్లాడేందుకు వాడే ఫోన్లోని సిమ్కార్డ్ను కోల్కతా నుంచి ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దాని యాక్టివేషన్ ఓటీపీని కూడా అతడు లాహోర్లోని పాక్ ఆపరేటివ్తో పంచుకొన్నాడు. సదరు కోల్కతా వ్యక్తి పాక్ జాతీయురాలిని పెళ్లి చేసుకొన్నాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి స్థిరపడ్డాడు. ఏటా రెండుసార్లు కోల్కతా వెళ్లి వస్తుంటాడని గుర్తించారు. ఇక మోతీరామ్ జాట్ నుంచి అత్యంత సున్నితమైన సమాచార పత్రాలను సదరు లాహోర్ ఆపరేటివ్ తెప్పించుకొన్నాడు. ఇందుకోసం అత్యధికంగా రూ.12,000 వరకు చెల్లించాడు. ఆ డబ్బు భారత్లోని దిల్లీ, మహారాష్ట్ర, హరియాణ, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, వెస్ట్బెంగాల్లోని వివిధ ఖాతాల నుంచి జమయ్యేవి.
ఈ నగదు పంపించే వారిలో ఒకరి పేరు షెహజాద్గా గుర్తించారు. అతడిని యూపీ పోలీసులు మే లోనే అరెస్టు చేశారు. అతడు పాకిస్థాన్ నుంచి దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, కాస్మోటిక్స్ స్మగ్లింగ్ చేసి విక్రయించేవాడు. అయితే షెహజాద్ వాదన భిన్నంగా ఉంది. తాను రైల్లో దిల్లీ నుంచి పంజాబ్ వెళుతున్న సమయంలో తోటి ప్రయాణికుడు ఒకరు జాట్ నెంబర్కు రూ.3,500 పంపాల్సిందిగా కోరి.. తనకు ఆ మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చాడని చెబుతున్నాడు.





