
కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది.
ప్రధాన వక్త, నవయుగ భారతి ప్రధాన సంపాదకులు శ్రీ వడ్డి విజయసారథి సదస్సు ముఖ్య అంశాన్ని ప్రస్తావిస్తూ దేశ ప్రజలకు అవసరమైన అన్ని విషయాలను గమనించి దానికి తగిన సౌకర్యాలు, విశ్వాసాన్ని కల్పించాల్సిన ప్రభుత్వాలు గత ఏడు దశాబ్దాలుగా తమ పదవుల కోసం ప్రజల సొమ్మును దోచుకుని దాచుకోవాలన్న యావతో ప్రజాసంక్షేమాన్ని, దేశ భద్రతను గాలికి వదిలేశాయన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం గతంలో జరిగిన ఆ లోపాలను సవరిస్తూ పౌరసత్వ చట్టానికి సవరణ రూపొందించిందని, దీన్ని అందరూ ఆహ్వానించాలే గానీ భయపడాల్సిన పని లేదని తెలిపారు.
చరిత్రపై అవగాహన లేనివారు ఈ చట్టాన్ని విమర్శిస్తున్నారని, ఇది ఎవరినీ విమర్శించేది గాని, శిక్షించేది గాని కాదని, తరతరాలుగా భారతదేశం అవలంబిస్తున్న విశ్వమానవ సౌభ్రాతృత్వానికి కొనసాగింపు మాత్రమే ఈ చట్ట సవరణ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రజ్ఞాభారతి నంద్యాల అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ పాండే మాట్లాడుతూ ఈ చట్ట సవరణ దేశప్రజల సౌకర్యానికి, ముస్లిం దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లలో మత హింసకు గురైన ముస్లిమేతరుల రక్షణకు సంబంధించిదని తెలియజేశారు.
ప్రజ్ణాభారతి నంద్యాల సంయోజకులు అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజ హితం కోసం విద్య, వైద్యం, పర్యావరణం లాంటి వివిధ విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం పౌరసత్వ సవరణ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలియజేశారు.

అతిథిగా పాల్గొన్న చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ ఏ దేశమైనా ప్రజోపయోగం కొరకు నియమాలు, నిబంధనలు రూపొందించి అమలు చేయాలని, అదే ఆ దేశ అభివృద్ధికి సంకేతమన్నారు.
మరో అతిథి, ప్రముఖ న్యాయవాది శ్రీ రామచంద్ర రావు ఇలాంటి అవగాహన సదస్సులు నేటి పరిస్థితులలో చాలా అవసరమని, ప్రజ్ణాభారతి చాలా మంచి పని చేసిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్లు, న్యాయవాదులు వ్యాపారస్తులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





