News

పూరీ ఆలయంలో రహస్య గది లేదు: ఏఎస్‌ఐ

149views

ఒడిశాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భాండాగారంలో ఎలాంటి రహస్య గది లేదని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) స్పష్టం చేసింది. గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) సర్వే ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. పూరీ ఆలయంలోని రత్న భాండాగారం పునరుద్ధరణ, మరమ్మతు పనులను ఏస్‌ఐ ఇటీవల పూర్తి చేసింది. భీతర, బాహర అనే రెండు భాగాలుగా రత్న భాండాగారం (ఖజానా) ఉందని, వీటిని ఒక ఇనుప గేటుతో వేరు చేసి, బయట నుంచి తాళం వేశారని తెలిపింది. ఈ గదులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత గోడల్లో, భూమి కింద భాగంలో ఏవైనా రహస్య గదులు, అరలు ఉన్నాయేమో నిర్ధారించడానికి జీపీఆర్‌ సర్వే చేపట్టాలని నిర్ణయించామని పేర్కొంది.