
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని సోమవరప్పాడు పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా పడి 14 ఆవులు మృత్యువాత పడ్డాయి. విశాఖపట్నం నుంచి గుంటూరు పశువుల సంతకు తరలిస్తుండగా వ్యాన్ బోల్తా పడడంతో వ్యాన్లో ఉన్న 30 ఆవులలో 14 ఆవులు మృతి చెందాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ గుమ్మడి వెంకట చైతన్యకృష్ణ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ -ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన పశువులను పరిశీలించారు. అనుమతి లేకుండా పశువులను సంతకు తరలించే వారిపై కేసులు నమోదు చేయాలని, పోలీసులు నిత్యం తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ రాజశేఖర్, ఎస్ఐ శివాజీ బీజేపీ నాయకులతో చర్చలు జరిపి అనుమతి లేకుండా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాన్ బోల్తా సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.





