
ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్రమ మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మరో నాలుగు అక్రమ మదర్సాలను సీల్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ హరిద్వార్ లో ఓ లెక్క ప్రకారం 85 కి పైగా అక్రమ మదర్సాలను పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం మూసేసింది. ముఖ్యమంత్రి ధామీ సూచనల మేరకు హరిద్వార్ జిల్లా యంత్రాంగం అక్రమ మదర్సాలను గుర్తించి, సీల్ చేస్తోంది.జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ ఏర్పాటు చేసిన బృందం హరిద్వార్ జిల్లాలో అక్రమంగా నడుస్తున్న మదర్సాలను సీల్ చేస్తోంది.
తాజాగా నాలుగు మదర్సాలను హరిద్వార్ లో సీల్ చేశామని జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ కూడా ధ్రువీకరించారు. ఈ కార్యక్రమం కొనసాగుతుందని కూడా ప్రకటించారు.అక్రమ మదర్సాలను సీల్ చేస్తామని, చట్టబద్ధమైన మదర్సాలపై సర్వే నిర్వహించి, అవి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నాయో పరిశీలిస్తామని ప్రకటించారు.మదర్సాలలో జాతీయ పాఠ్యాంశాలను బోధించడం తప్పనిసరి అని, పరిపాలన దానిని సమీక్షిస్తుందని ఆయన అన్నారు.
ఇక.. ఈ యేడాది మార్చి మాసంలో కూడా ఉత్తరాఖండ్ సర్కార్ అక్రమ మదర్సాలపై ఉక్కుపాదం మోపింది. మతం ముసుగులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్న మదర్సాలపై 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 52 అక్రమ మదర్సాలను సీల్ చేశారు.డెహ్రాడూన్ లోనే ఒక్క రోజులోనే 12 అక్రమ మదర్సాలను, ఖతిమా అనే ప్రాంతంలో 9 అక్రమ మదర్సాలను సీల్ చేశారు.
ముఖ్యమంత్రి తన ప్రభుత్వం అక్రమ మదర్సాలను పనిచేయడానికి అనుమతించదని పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారు, కానీ వాటిని తొలగించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఒక నెల క్రితం, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములలో ఏర్పాటు చేసిన అక్రమ మదర్సాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ, అన్ని జిల్లా న్యాయాధికారులు, రాష్ట్ర పోలీసులు మరియు సచివాలయంలోని సంబంధిత ఇతర సీనియర్ అధికారులను ఆయన ఆదేశించారు. ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు రాష్ట్రంలో దాదాపు 416 మదర్సాలను నిర్వహిస్తుండగా, నియంత్రించబడని మరియు నమోదు కాని మైనారిటీ సంస్థల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు.





