News

భారత్‌ ఇకపై ఉగ్రవాద బాధితురాలిగా ఉండదు : రాజ్‌నాథ్‌

261views

దాయాది పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని వ్యాఖ్యానించారు. ఉగ్ర చర్యలకు వ్యూహాత్మకంగా బదులిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌తో బలమైన సందేశం పంపామన్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు. ఇది కేవలం విరామం మాత్రమే’ అని అన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నార్తర్న్ కమాండ్ వద్ద సైనికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులకు, వారిని పోషిస్తున్న వారికి గట్టి సందేశం ఇచ్చాం. ఇకపై భారత్‌ ఉగ్రవాద బాధితురాలిగా ఉండదని, బలమైన వ్యూహంతో స్పందిస్తుందని శక్తివంతమైన సందేశాన్ని పంపాం’ అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడంలో సాయుధ దళాలు, నిఘా సంస్థల కృషిని ఆయన ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, సరిహద్దు దాటి ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి ఓ హెచ్చరిక అని తెలిపారు. భార‌త్‌ ఇకపై ఉగ్రవాదాన్ని సహించదని స్పష్టం చేశారు. దేశ ఐక్యత, సమగ్రతకు హాని కలిగిస్తే తగిన సమాధానం ఇస్తుందని వ్యాఖ్యానించారు.