
‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కి ఆ దేశం ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించింది. అయితే, ఆ దేశ ప్రజలు ఆసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్ కాదు ఫేయిల్డ్ మార్షల్’’ అంటూ విమర్శిస్తున్నారు. తాజాగా, ఆసిమ్ మునీర్ అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. వాషింగ్టన్లో పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వాషింగ్టన్లో మునీర్ ఉంటున్న హోటల్ ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి, అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యానికి ఆసిమ్ మునీర్ అడ్డుగా ఉన్నాడని ఆరోపించారు. హోటల్ భవనం నుంచి పాక్ ఆర్మీ చీఫ్ బయటకు వెళ్తుండగా ప్రజలు ‘‘ఆసిమ్ మనీర్ నువ్వు పిరికివాడివి, నీకు సిగ్గులేదు, సామూహిక హంతకుడివి, నువ్వు నియంత’’ అంటూ నినాదాలు చేశారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఆ దేశంలోని ఒక వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ, దాని మద్దతుదారులు తాజా నిరసనలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, పీటీఐ కార్యకర్తల అరెస్టులకు మునీర్ కారణమని ఆ పార్టీ, దాని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మునీర్ అధికారిక పర్యటనకు ముందే అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల నిరసనలు నిర్వహించారు. అమెరికాతో సైనిక మరియు వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం మునీర్ ఆదివారం వాషింగ్టన్ వెళ్లినట్లు ఆ దేశ మీడియా చెబుతోంది.





