
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం విజయవంతమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఉదయం 9.28 గంటలకు చేపట్టారు. అనంతరం వివిధ దశల్లో 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. నిర్దేశిత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ఉపగ్రహాలు చేరాయి. పీఎస్ఎల్వీ సంకేతాలను అంటార్కిటకలోని ఇస్రో కేంద్రం అందుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ47 ప్రయోగానికి మంగళవారం ఉదయం 7.28 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటలపాటు సాగింది.

చంద్రయాన్-2 తర్వాత ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగమిది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3తోపాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపారు.. మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3. దీని జీవిత కాలం ఐదేళ్లు.. బరువు సుమారు 1625 కిలోలు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్-3 మరింత స్పష్టంగా తీయనుంది.
మాకు ఇప్పుడు చేతినిండా పని ఉంది : శివన్
ప్రయోగం విజయంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడారు. ఈ అద్భుత ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి వరకు 13 మిషన్లు ఉన్నాయని.. తమకు ఇప్పుడు చేతి నిండా పని ఉందని పేర్కొన్నారు. సందర్భానికి తగినట్లుగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





