
-వలివేటి అమరేంద్ర
మనకి కనిపించడంలేదూ అంటే మనకన్ను చూడలేకపోతోందని అర్ధం! లేదని కాదు!
కృష్ణుడు చెప్పిన ధర్మం మతం కాదు. మన జీవితం!
గీతతో కోట్లమందికి దారి చూపించిన అతనికన్నా గురువెవ్వరు?
రక్షణకోసం సముద్రం మధ్యలో ద్వారక నిర్మించిన అతనికన్న గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు?
చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్న గొప్ప సైకాలజిస్ట్ ఎవరు?
వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసిన అతనికి మించిన మ్యూజీషియన్ ఎవరు?
నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టరెవరు?
ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతనికి మించిన వీరుడెవ్వరు?
కరవు కష్టం తెలియకుండా చూసుకున్న అతనికి మించిన రాజెవ్వడు?
హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్ధం చేసుకున్న
గొప్ప క్లైమేటాలజిస్ట్ ఎవరు?
అన్ కంట్రోలబుల్ ఆర్పీఎమ్(RPM) తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు?
అతనొక ఫైటర్ (Fighter) సింగర్(Singer) టీచర్ (Teacher)వారియర్(Worrier) what not? he is everything! His Aura is eternal. He is more than God to me. I worship His Excellence!
కార్తికేయ2 సినిమాలో, శ్రీకృష్ణుడి అద్వితీయశక్తులగురించి తెలియని హీరోకి, కనువిప్పు కలిగించ డానికి సూటిగా, స్పష్టంగా,సరళంగా సైంటిస్ట్ అద్భుతవాక్యాలివి! వీర్ సావర్కర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక మనకు పై సినిమా సీన్ గుర్తుకొచ్చిందంటే, మనకు ఆయన సరిగా అర్ధమైనట్లే!
వీరసావర్కర్ బహుముఖప్రజ్ఞాశాలి. దార్శనికుడు, ద్రష్ట, పోరాటవ్యూహకర్త, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘసంస్కర్త, సామాజికశాస్త్రవేత్త, రచయిత, రాజనీతిపండితుడు…! ఇంతటి విలక్షణం గా వెలిగిన ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్యఘట్టాన్ని ఇప్పుడు ప్రస్తావించుకుందాం!
కుటిలత్వం,విభజనవ్యూహం, పైశాచికత్వప్రదర్శనతో అధికారంలోకొచ్చిన బలహీనుడు, దుర్బలుడికి, చీకట్లో తననీడను చూసినా ఉలికిపాటే! ఏనాడూ లక్షకు మించని పౌర, సైనిక సిబ్బందితో, సుమారు 31కోట్లమంది భారతీయులను పాలించిన బ్రిటిష్ వాడికి ఈ అన్వయం సరిగ్గా సరిపోతుంది.
లండన్లో లా చదువుతున్నప్పుడే, వివాదాస్పదమైన, అత్యంత కఠినమైన 1881నాటి పారిపోయిననేరస్తుల చట్టాన్ని ఆయనపై ప్రయోగించాలన్నంత కోపం బ్రిటిషువాళ్ళకు ఎందుకువచ్చిందో తెలుసుకుంటే, వారినెంతటి అభద్రతాభావానికి ఆయనగురిచేశాడో అర్ధమవుతుంది. 23యేట చదువుకనిచెప్పి వచ్చిరాగానే తోటిభారతీయులతోబాటు, అమెరికా, ఐరిష్, ఫ్రెంచ్, ఇటలీ, రష్యాలకు చెందిన వీరులను నిరంతరం కలుస్తూ, బ్రిటిషుపాలనను అంతం చేయడానికి చర్చలు జరుపుతూ, వ్యూహాలు రచించడం వారి దృష్టికొచ్చింది. నిజాయితీగల విద్యార్ధిగా ముద్రవేసి అప్పటి బ్రిటిష్ భారతప్రభుత్వం పంపింది కాబట్టి విధిలేక ఆయనను తిరిగి భారత్ కు పంపి విచారణ చేయాల్సివచ్చింది. అలా ఆయనను మన దేశానికి తిరిగి తీసుకువస్తున్న క్రమంలో ఫ్రాన్స్ లోని మాశై (Marseilles) రేవుదగ్గర ఆగిఉన్న నౌకనుండిదూకి ఈదుతూ, తీరంచేరుకొని, ఫ్రాన్స్ పోలీసులకు లొంగిపోయారు. మేడం కామా, వివిఎస్ అయ్యర్ అనే న్యాయవాదులు వచ్చి ఆయన తరఫున వాదించాల్సి ఉండగా, ఫ్రెంచ్ పోలీసులకు బ్రిటిష్ పోలీసులు లంచమిచ్చి ఆయననుతిరిగి తమస్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో బ్రిటిష్ వాళ్ళు మరింత బెంబేలెత్తిపోయారు. భారత్ కు తీసుకొచ్చాక ఆయనపై నాసిక్ కలెక్టర్ ని చంపడానికి కుట్రచేశారని, బ్రిటన్ రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని దొంగకేసులుపెట్టి, హడావుడిగా విచారణ తంతు ముగించి, 50ఏళ్ళనిడివిగల రెండుజీవితకాల జైలుశిక్షలు విధించారు. ఆయనొక రాజకీయ ఖైదీ. సాధారణంగా హత్యలు, మానభంగాలు, భారీదొంగతనాలు చేసిన వారితో పోలిస్తే, రాజకీయఖైదీలకు విధించే శిక్ష, దాని అమలులో కొంత మెరుగ్గా ఉంటుంది. కానీ సావర్కర్ ఆ భాగ్యానికి కూడా నోచుకోలేదు.
అదేసమయంలో మింటోమార్లే సంస్కరణలకు వ్యతిరేకంగా సాయుధ దళాన్ని తయారుచేసి, తిరుగుబాటుకు సిద్ధమైన వీర్ సావర్కర్ సోదరుడు గణేష్ సావర్కర్ ని కూడా అరెస్ట్ చేసి జీవితఖైదు విధించి వీర్ సావర్కర్ తో బాటే అండమాన్ జైలుకు పంపారు.
అత్యంతప్రమాదకారిఅనేముద్రను సూచించే Dగుర్తు వేసిమరీ 1910లో అండమాన్ జైలుకు సావర్కర్ ను తరలించారు. అక్కడ అనేక కఠినమైనశిక్షలకు గురిచేసారు. కాళ్లూచేతులకు సంకెళ్ళు వేసే ఉంచేవారు. గోడకు సంకెళ్ళుపెట్టి వాటితో ఆయన చేతులుకట్టేసి వారంరోజులు పైగా అలా ఉంచే వారు. కొరడాలతో కొట్టేవారు. నూనెతీసే గానుగకు ఎద్దుకు బదులు సావర్కర్ ను కట్టి రోజంతా నూనె తీయించేవారు. శుభ్రంచేయకుండా, తీవ్రదుర్గంధం వెలువడే టాయిలెట్లనే ఆయన వాడుకోవాల్సి వచ్చేది. కావాలని పురుగులపడ్డ భోజనం అందించేవారు. తాగడానికి మురుగునీరే దిక్కు. మనిషి అనేవాడు కనపడకుండాఉండే ఏకాంతకారాగారపుగదిలో ఆరునెలలకు పైబడి నిర్బంధించి ఉంచే వారు. ఆ గదికున్న కిటికీలోంచి బయటకుచూస్తే, ఇతరఖైదీలకు విధించేశిక్షలు కనిపించేవి. గాంధీ నెహ్రూలతోసహా ఇంతటి సుదీర్ఘమైన, కఠినమైన, అమానుషమైన శిక్ష భారత స్వాతంత్ర్యసమర యోధులలో మరెవ్వరికీ విధించబడలేదు.
నాలుగేళ్లపాటు ఇలాంటి శిక్షలు ఎన్నివిధించినప్పటికీ లొంగిపోవడానికి ఆయన సిద్ధపడకపోగా, జైలు లో ధర్నాలుచేయడం, జైలుసిబ్బందికి సహాయనిరాకరణ వంటి నిరసనలు చేయడం మొదలయ్యా యి. దీనికితోడు జైలునుండే బాంబుతయారీకి సావర్కర్ చేసిన ప్రయత్నాలు ఒక్కసారిగా బ్రిటిష్ వారిని ఉలికిపాటుకు గురిచేసింది.
దీనితో అసలక్కడేం జరుగుతోందో చూసిరమ్మని రెజినాల్డ్ హెచ్. క్రాడాక్ అనే తమ ప్రభుత్వప్రతినిధిని పంపారు. సావర్కర్ తోబాటు బరిన్ ఘోష్, నంద్ గోపాల్, హృషికేష్ కంజిలాల్ మరియు సుధీర్ కుమార్ సర్కార్ వంటి రాజకీయ ఖైదీలతో సుదీర్ఘంగా చర్చించారాయన. అప్పటి చట్టాలప్రకారం, తన వాదనలను తన న్యాయవాది ద్వారా కోర్టులో ఎలావాదన చేసుకోవచ్చో, అలానే రాజకీయ ఖైదీలు కూడా తమ వాదనలను ప్రభుత్వానికి తెలియచేసుకోవచ్చు. ఇదే అవకాశాన్ని ఆ ప్రభుత్వ ప్రతినిధి వారికిచ్చారు.
బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి త్వరగా విముక్తిపొంది, స్వాతంత్ర్యపోరాటంలోకి తిరిగివచ్చి మాతృభూమికి సేవచేయడమే విప్లవకారుడి ప్రాథమికకర్తవ్యమని సావర్కర్ తరచుగా తోటి రాజకీయ ఖైదీలకు సలహాఇచ్చేవాడు. అసలే న్యాయవాదికూడా అయిన సావర్కర్ ఈ చక్కని అవకాశాన్ని వదులుకుంటాడా? పైగా అంతర్జాతీయంగా ముఠాకట్టి, వారి అధికారానికి ఛాలెంజ్ విసిరిన ధైర్యశాలి, అంతర్జాతీయ న్యాయసూత్రాలను తనఉద్యమానికి వాడుకోవాలన్న ప్రయత్నం చేసిన సాహసి, తన స్వంతగడ్డపై పరాయిపాలకులకు తొడగొట్టి సవాల్ విసరకుండాఉంటాడా అన్న వణుకు సహజంగానే పిరికి బ్రిటిష్ మూకలకు ఉంది.
దానికితగ్గట్లు సరిగ్గానే వ్యూహాత్మకంగానే ప్రభుత్వానికిచ్చే పిటిషన్ అవకాశాన్ని ఉపయోగించు కున్నాడు. దానిపై ఆ బ్రిటిష్ వాడు తన రిమార్క్స్ ఇలారాశారు: ఆయనెప్పుడూ మర్యాదగానే ఉంటారుకానీ ప్రభుత్వానికి సహాయంచేయడానికి ఎప్పుడూ ఎలాంటి సుముఖత చూపించలేదు. ఆయన పిటిషన్ లో వాడినభాషలో కూడా ఎక్కడా పశ్చాత్తాపభావన కనిపించలేదు. పైగా ఒక రాజకీయఖైదీగా తనకున్న హక్కులను ప్రస్తావించడమే కాక, నాసిక్ కు పంపిన 20తుపాకులు విప్లవం కోసమేనని నిర్భీతిగా ఒప్పుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన నిజమైన రాజకీయఅభిప్రాయాలు ఏమిటో చెప్పడం అసాధ్యం. పరివర్తన వచ్చిందని అనుకోలేం. జైల్లో ఉన్నట్లే, విడుదల చేశాకకూడా ఉంటారని నమ్మలేమని స్పష్టంగా రాశారు. దానికితోడు విడుదలచేసి, ముంబైకి తరలించే క్రమంలో నౌకనుండి ఆయనను తప్పించితీసుకెళ్లడానికి ఆయనమిత్రులు సన్నాహాలు చేయడం కూడా బ్రిటీషర్లకు తెలిసి పోయింది. దీనితో వారు ఆయనపై పూర్తిగా నిఘాపెట్టారు.
తాను బయటపడటానికి ఎన్నిరకాల ఎత్తుగడలు వేయాలో అన్నీవేస్తూనే, భారత స్వాతంత్ర్య సమరా నికి కావలసిన మానవవనరులను తయారుచేయడానికి తహతహలాడుతున్న ఆయన ప్రయత్నా లన్నింటినీ బ్రిటిష్ వాడి అదృష్టం కొద్దీ విఫలమయ్యాయి.
అక్టోబర్ 5, 1917లో తిరిగి అలాంటి పిటిషన్ పెట్టుకునే అవకాశమే వచ్చినపుడు, మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణ ప్రస్తావించి నిశితంగా విమర్శించారు. అప్పటి ఇండియన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగ్ కు రాసిన ఆ లేఖలో, భారతదేశానికి స్వంత రాజ్యాంగమే లేనప్పుడు, రాజ్యాంగ ఉద్యమాలన్న ప్రసక్తి ఎలా వస్తుందని హేళన చేశారు. అజ్ఞాతంలో మగ్గుతూ ఉద్యమాలుచేయడం ఎవరికీ సరదాకాదని, స్వంత రాజ్యాంగాన్ని ఏర్పాటుచేసి, స్వపరిపాలన అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పైగా క్షమాభిక్ష తిరస్కరించడానికి తన పేరు ఉండటమే కారణమయ్యేట్లయితే, నిస్సంకోచంగా తన పేరు తొలగించి, మిగిలిన వారినైనా విడుదల చేయమని హితవు చెప్పారాయన. మొదటి ప్రపంచయుద్ధం ముగిశాక, బరిన్ బోస్, త్రైలోక్యనాథ్ చక్రవర్తి, హేమచంద్ర దాస్, సచీంద్రనాథ్ సన్యాల్, పరమానంద్ వంటి వారితో సహా 1919 నాటి సహాయనిరాకరణోద్యమం లో పాల్గొని సెల్యులార్ జైలుకొచ్చిన పలువురు కాంగ్రెస్ నాయకులను అలానే విడుదలచేశారు కూడా. ఒక్క సావర్కర్ ని, అతని సోదరుణ్ణి తప్ప!
11 ఏళ్ళు అండమాన్ జైలులోనూ, 3 ఏళ్ళు రత్నగిరి జైలులో కఠినశిక్ష అనుభవించాక, మరొక 13 ఏళ్ళు గృహనిర్బంధం అనుభవించాలన్న షరతుపై ఆయనను 1924లో విడుదల చేసినప్పటికీ, ప్రత్యక్ష రాజకీయకార్యకలాపాలలో పాల్గొనకూడదన్న షరతు ఉన్నప్పటికీ, జపాన్ లో ఉన్న రాస్ బీహారీ బోస్ తో రహస్యంగా నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, తిరుగుబాటుకు నేతాజీని తగిన నేతగా గుర్తించి, ఆయనతో సమావేశమై, ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మాణానికి రాస్ బిహారీ బోస్ సిద్ధం చేస్తున్న ప్రయత్నాలను వివరించి, తదనంతర కాలంలో నేతాజీ సాగించిన ప్రత్యక్ష యుద్ధానికి బీజం వేశారు!
అలా ఆయన ఒక యోధుడు, స్ఫూర్తి రగిల్చే నాయకుడు, ద్రష్ట! బానిసత్వం నుండి భారత్ కు విముక్తి కలిగించడానికి చేసిన యుద్ధానికి ఆయన వ్యూహకర్త!
ఇవేమీ చూడటానికి ఇష్టపడని వక్రకోణపు చరిత్రకారుల కంటికి ఆయన విశిష్టత కనపడలేదు. వారు చూడలేకపోయినంత మాత్రాన వీర్ సావర్కర్ ఘనత లేనట్లు కాదు కదా!





