
పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్పై యావత్ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఇదే సమయంలో నెట్టింట మరో చర్చ మొదలైంది. మైసూర్పాక్ పేరును మార్చాలని కొందరు సోషల్మీడియాలో ప్రతిపాదనలు చేశారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి దీనిపై మీమ్స్ కూడా చేశారు. ఈ డిమాండ్ ఓ వ్యాపారికి బాగా నచ్చేసింది. అందుకే తమ దుకాణంలో విక్రయించే స్వీట్లలో ‘పాక్’ పదాన్ని తీసేసి కొత్త పేర్లు పెట్టారు. మైసూర్ పాక్ను ‘మైసూర్ శ్రీ’గా మార్చేశారు.
రాజస్థాన్లోని జైపుర్లో గల ప్రముఖ ‘త్యోహార్ స్వీట్స్’ యజమాని ఈమేరకు తమ దుకాణంలో మార్పులు చేశారు. మైసూర్ పాక్తో పాటు.. మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ పేర్లను మార్చి.. మైసూర్ శ్రీ, మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ అని కొత్త పేర్లు పెట్టారు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు. దీనిపై ఆ దుకాణం యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ.. ‘‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు. ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.
వాస్తవానికి ‘పాక్’ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దానర్థం ‘వండటం’ అని. ఇక, కొన్ని భాషల్లో చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థాన్ని కూడా పాకం అని పిలుస్తాం. ఇక్కడ ఈ పదానికి పాకిస్థాన్తో సంబంధం లేకపోయినప్పటికీ.. దాన్ని పలికే శబ్దం ఆ దేశాన్ని గుర్తుచేసేలా ఉండటంతోనే పేరు మార్చినట్లు అంజలీ జైన్ తెలిపారు. ‘శ్రీ’ అనే పదం శుభానికి సూచికగా పెట్టినట్లు పేర్కొన్నారు.





