
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరం నిర్మాణం జూన్ 5 నాటికి ముగుస్తుందని శ్రీ రామ్ జన్మభూమి నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఆలయంలో రామ్దర్బార్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 5న జరిగే ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వివిధ విశ్వాసాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రముఖ వార్తా సంస్థ ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ వేడుకకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వీఐపీలను ఆహ్వానించడంలేదని తెలిపారు. దాదాపు ఐదు వందల ఏళ్ల పోరాటం తర్వాత ఈ క్షణం ఆసన్నమైందన్న నృపేంద్ర మిశ్రా.. రామాలయం నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేవన్నారు. జూన్ 5 వేడుక అనంతరం వారం రోజుల్లో అయోధ్యలోని రామాలయంలోని కొత్త భాగాన్ని ప్రజల కోసం తెరవనున్నట్లు తెలిపారు.
అయోధ్యలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని గతేడాది జనవరి 22న కన్నుల పండువగా నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ వేడుక నిర్వహించారు. దేశ విదేశాల నుంచి దాదాపు 7,000 మందికి పైగా ప్రముఖులు ఆ మహత్తర ఘట్టాన్ని వీక్షించారు. అనంతరం అయోధ్య మందిరంలో రాముడిని దర్శించుకొనేందుకు ప్రపంచ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.