ArticlesNews

సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందిస్తున్న టిటిడి

101views

సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేందుకు టిటిడి విశేష కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ ఏకైక సంస్థగా పేరొందింది. భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ మరియు నిర్మాణ రంగంలో నైపుణ్యం గల వ్యక్తులను శిక్షణ ఇస్తున్న ఒక ప్రత్యేక సంస్థ. భారతీయ సంస్కృతి మరియు వారసత్వానికి దిశా నిర్దేశకులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ సంస్థ సహాయపడుతుంది. ఈ సంస్థ ఆలయ నిర్మాణ శిల్పకళ, వాస్తుశిల్పం మరియు ఇతర సంబంధిత కళా రూపాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. 1960వ సంవత్సరంలో స్థాపించి శిల్పశాస్త్రాల ప్రకారం విద్యార్థులకు టిటిడి శిక్షణ ఇస్తోంది.

కోర్సులు

డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ కోర్సు
రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ, ఏపీ మరియు ఏఐసిటిఈ, న్యూఢిల్లీ వారి అనుమతి పొందింది. ఈ కోర్సు 4 సంవత్సరాల కాలపరిమితితో 6 విభాగాలు ఉండగా, అందులో 1. ఆలయ నిర్మాణ విభాగం 2. శిలా శిల్ప విభాగము, 3. సుధా శిల్ప విభాగము, 4. లోహ శిల్ప విభాగము, 5. కొయ్య శిల్ప విభాగము, 6. సంప్రదాయ వర్ణచిత్ర లేఖన విభాగములు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విభాగంలో పది మంది విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశము ఉంటుంది. మొత్తం ఆరు విభాగాలలో 60 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశము కల్పిస్తారు. డిప్లొమా కోర్సులో చేరే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించబడుతుంది. నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఆలయ నిర్మాణ శిల్పకళా విజ్ఞానం కొరకు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చారిత్రక ఆలయాల సందర్శనకు ఉచితంగా పంపిస్తారు.

సంప్రదాయ కలంకారి కళ ( సర్టిఫికెట్ కోర్సు)
వస్త్రాలపై కలంకారికళ చిత్రరచనా విధానంపై 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు ఉంది. కలంకారి కళలో పదవ తరగతి పాసైన వారు ప్రతి సంవత్సరం 10 మంది విద్యార్థులకు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజనం కల్పించబడును. కలంకారి కోర్సు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు స్వయం ఉపాధిని పొందవచ్చు. దేశ విదేశాలలో కలంకారి కళకు మంచి ఆదరణ ఉంది.

ప్రవేశం
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థినీ విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. 2025 – 26 సంవత్సరానికి మే 5 నుండి జూన్ 20వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థుల పేరిట, తిరుమల తిరుపతి దేవస్థానంవారు రూ. 1 లక్ష జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. యాజమాన్యం నియమావళి ప్రకారం ఈ కళలో స్థిరపడుటకు మరియు వారిని ప్రోత్సహించుటకు వడ్డీతో సహా కలిపి ఈ నగదు ఇవ్వబడును.

ఉపాధి అవకాశాలు
ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఇదే సంస్థలో ఉపాధ్యాయులుగా, టిటిడి రినోవేషన్ విభాగంలో స్థపతులుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా, కాంట్రాక్టర్లుగా అవకాశాలు పొందుతున్నారు. అంతేగాక ప్రభుత్వ శాఖలైన దేవాదాయ, ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖ, పురావస్తు పరిశోధనా శాఖల్లో పనిచేస్తూ అనేక జాతీయ సంస్థల నుండి అవార్డులు కూడా సాధిస్తున్నారు. శిల్పశిక్షణ సంస్థకు అనుబంధంగా ఉన్న శిలా శిల్ప ఉత్పత్తి విభాగంలో కొందరు విద్యార్థులు కాంట్రాక్ట్ పద్ధతిన దేవతామూర్తుల ప్రతిమలను తయారు చేస్తున్నారు.


ఇతర వివరాలకు
శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ,
తిరుమల తిరుపతి దేవస్థానములు
అలిపిరి రోడ్, తిరుపతి – 517507.
తిరుపతి జిల్లా
వెబ్ సైట్ అడ్రెస్ https://ttdevasthanams.ap.gov.in/
ఆఫీస్ ఫోన్ నెంబర్ – 0877 – 2264637