
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టిటిడి ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చని తెలిపింది.
ఫీడ్ బ్యాక్ విధానం..
తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సప్లో టిటిడి అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైన అంశాలు)ను ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్ట్స్ లేదా వీడియో ఫార్మాట్ను ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని ‘ఉత్తమం’, ‘సగటు’, ‘మరింత మెరుగుదల అవసరం’, లేదా ‘బాగాలేదు’ వంటి వాటికి రేటింగ్ ఇవ్వాలి. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్ఠంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియో రూపంలో అప్లోడ్ చేయవచ్చు. అభిప్రాయాలను సమర్పించిన వెంటనే, ‘మీ అభిప్రాయం విజయవంతంగా నమోదయ్యింది. మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు’ అనే ధ్రువీకరణ సందేశం వస్తుంది. ఈ విధంగా భక్తుల నుంచి అందిన అభిప్రాయాలను తితిదే యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది.




