News

భారతీయ సంస్కృతి తెలిపేలా ఎన్‌సీఈఆర్టీ పాఠ్యాంశాలు

273views

ఎన్‌సీఈఆర్టీ 7వ తరగతి కొత్త సాంఘిక శాస్త్ర పుస్తకంలో మొగల్స్‌, ఢిల్లీ సుల్తానుల చరిత్ర పాఠ్యాంశాల స్థానంలో ప్రాచీన భారతీయ రాజవంశాలైన మగధ, మౌర్యులు, శాతవాహనులు, శుంగలు వంటి రాజ్యాలపై కొత్త చాప్టర్లను ప్రవేశపెట్టారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)–2020, నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌)–2023లో భాగంగా ఈ కొత్త పుస్తకాలను రూపొందించారు.

‘ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ: ఇండియా అండ్‌ బియాండ్‌, పార్ట్‌–1’ పేరుతో ఉన్న ఈ కొత్త సాంఘిక శాస్త్ర పుస్తకంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన మహా కుంభమేళాతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన మేకిన్‌ ఇండియా, బేటీ బచావో–బేటీ పడావో వంటి అంశాల గురించి ప్రస్తావించారు. ‘భూమి పవిత్రంగా ఎలా మారుతుంది’ అనే చాప్టర్‌ భారత్‌తో పాటు బయటి ప్రాంతాల్లో అన్ని మతాలు పవిత్రంగా పరిగణించే ప్రదేశాలు, తీర్థయాత్రలపై దృష్టిపెట్టింది. ఇందులో 12 జ్యోతిర్లింగాలు, చార్‌దామ్‌ యాత్ర, శక్తిపీఠాలతో కూడిన పవిత్ర భౌగోళిక ప్రాంతాల వివరాలను చేర్చారు.

అదేవిధంగా వివిధ చాప్టర్లలో జానపద, సమ్రాజ్‌, అధిరాజా, రాజాధిరాజా అనే సంస్కృతం పదాలను జోడించారు. ఇంకా గ్రీకులపై కూడా వివరణాత్మక విభాగాలు అందించారు. గత ఏడాది 3, 6వ తరగతులకు కొత్త పుస్తకాలను ప్రవేశపెట్టిన ఎన్‌సీఈఆర్టీ.. ఈ ఏడాది 4, 7వ తరగతులకు అప్‌డేటెడ్‌ వెర్షన్ల పుస్తకాలను తీసుకువచ్చింది. 7వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్‌–2 పుస్తకాన్ని కూడా త్వరలో విడుదల చేస్తామని ఎన్‌సీఈఆర్టీ అధికారి ఒకరు చెప్పారు. ఎన్‌సీఈఆర్టీ అంతకుముందు సిలబస్‌ హేతుబద్దీకరణలో భాగంగా 2022–23లో మొగల్స్‌, ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన సెక్షన్లను కొంత మేర, వారి విజయాలకు సంబంధించిన రెండు పేజీల టేబుల్‌తో పాటు తుగ్లక్‌లు, ఖిల్జీలు, లోడీల రాజ్యాల వివరాలను తగ్గించారు.

7వ తరగతి కొత్త సోషల్‌ సైన్సెస్‌ పుస్తకం ముందుమాటలో ‘ఈ పుస్తకంలోని అంశాలు మన విద్యార్థులు అభివృద్ధి చేయాలని కోరుకునే విలువలను ఏకీకృతం చేస్తాయి. భారతీయ సంస్కృతి లోతుల్లోకి వెళ్లాయి. వయసుకు తగినట్లుగా ప్రపంచ దృక్పథాలను పరిచయం చేస్తాయి’ అని ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లాని రాశారు.