News

సంచలన నిర్ణయం దిశగా భారత్.. పాక్‌తో ‘‘కాల్పుల విరమణ’’ రద్దు..

207views

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత్, పాకిస్తాన్‌తో ‘‘కాల్పుల విరమణ’’ను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తన నిబద్ధతను నిలబెట్టుకోకపోవడంతో ‘‘కాల్పుల విరమణ’’ రద్దును కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

పదే పదే ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ విఫలమవుతున్న నేపథ్యంతో పాటు, కాల్పుల విమరణ ఉన్నప్పటికీ, మన బలగాలపై సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా, టెర్రరిస్టుల్ని సరిహద్దు దాటించి భారత్‌లోకి పంపే సమయంలో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఫిబ్రవరి 24, 2021లో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఫిబ్రవరి 2021లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, లష్కరే తోయిబా (LeT), జైషే-ఏ-మొహమ్మద్ (JeM), మరియు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వంటి పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జమ్మూ మరియు కాశ్మీర్‌లోకి చొరబడుతూనే ఉన్నారు. పాకిస్తాన్ స్నైపర్ దాడులు, షెల్లింగ్స్‌తో పదేపదే విరమణని ఉల్లంఘిస్తోంది. 2023, 2024లో ఈ ఉల్లంఘనలు మరింతగా పెరిగాయి.