
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు అత్యంత దారుణమై దాడికి పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలను చూడటానికి వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ దాడిలో 27 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బైసరీన్ పచ్చిక మైదానాలు చూస్తున్న పర్యాటకుల్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కొందరు ఉగ్రవాదులు, పేర్లు అడుగుతూ, ఐడెంటిటీ కార్డులు చూస్తూ, హిందువులు అయితే కాల్చి చంపారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఉగ్రవాదుల్ని వడిచిపెట్టేది లేదని ప్రధాని మోడీతో సహా హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ తరుపున ఆడిన అతికొద్ది మంది హిందూ క్రికెటర్లలో ఒకరైన దానిష్ కనేరియా స్పందించారు. ‘‘పహల్గామ్ దాడిని క్రూరమైన దాడి’’గా ఖండించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ లౌకికవాదులు, న్యాయవ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తన పోస్టులో భర్తను కోల్పోయిన మహిళ, అతడి మృతదేహం పక్కన దీనంగా కూర్చుని ఉన్న ఫోటోని జత చేశారు.
గతేడాది కాలంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరిగాయి. హిందువుల ఆస్తుల్ని, గుడులను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలు చేశారు. బెంగాల్లోని ముర్షిదాబాద్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హిందువుల ఆస్తుల్ని, హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడుల వల్ల ముర్షిదాబాద్ నుంచి హిందువులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. తాజాగా, దానిష్ కనేరియా తన పోస్టులో రాడికల్ ఇస్లామిస్టుల గురించి ట్వీట్ చేశారు.





