News

ఇక మిలిగినవి నాలుగు జిల్లాలే.. నక్సల్ లొంగిపోవాలని అమిత్‌షా పిలుపు

80views

అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ సాధ్యమైనంత త్వరగా లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) శుక్రవారంనాడు మరోసారి పిలుపునిచ్చారు. 2026 మార్చి 31 కల్లా నక్సల్స్ బెడద నుంచి దేశానికి విముక్తి కలిగించాలనే కృతనిశ్చయంతో కేంద్రం ఉందని స్పష్టం చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులను కోబ్రా కమెండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారని, వారి నుంచి అధునాతన ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారని అమిత్‌షా తెలిపారు. 11 మంది మావోయిస్టులు కూడా సుక్మా జిల్లా బడేసేటీ పంచాయతీలో లొంగిపోయారని, దీంతో నక్సల్స్ బెడద నుంచి ఆ పంచాయతీకి విముక్తి లభించిందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అమిత్‌షా తెలిపారు.

నాలుగు జిల్లాలకే పరిమితం
కాగా, దీనికి ముందు మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జరిగిన సీఆర్‌పీఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం నాలుగు జిల్లాలకే నక్సల్స్ పరిమితమయ్యారని చెప్పారు. ప్రధానమంత్రి చెప్పినట్టుగా 2026 మార్చి 31వ తేదీ కంటే ముందే దేశానికి నక్సల్స్ బెడద నుంచి విముక్తి కల్పించేందుకు పట్టుదలగా ఉన్నామని తెలిపారు. ఈ దిశగా జరుపుతున్న పోరాటంలో సీఏపీఎఫ్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 400కు పైగా ఫార్వార్డ్ అపరేషన్ బేస్‌లను సీఆర్‌పీఎఫ్ ఏర్పాటు చేసిందని, దీంతో ఈ ప్రాంతాల్లో 70 శాతానికి పైగా హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని, ఇప్పుడు దీనికి ముగింపు పలకనున్నామని చెప్పారు.