
మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ మహారాజ్.. ఇద్దరూ నిజమైన జాతీయ హీరోలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఎంతమాత్రమూ జాతీయ హీరో కాదని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని సీఎం దేవేంద్ర ఫడణవీస్తో కలిసి రాజ్నాథ్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధైర్యం, దేశభక్తికి మహారాణా ప్రతాప్ ప్రతిరూపమన్నారు. శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధవ్యూహాలకు ఆయన నుంచే ప్రేరణ పొందారని తెలిపారు. భారత స్వాతంత్య్రానంతరం కొందరు వామపక్ష చరిత్రకారులు ఈ ఇద్దరు వీరులకు తగినంత గుర్తింపునివ్వలేదని రాజ్నాథ్ విమర్శించారు. వారిద్దరూ ముస్లిం వ్యతిరేకులేమీ కాదని స్పష్టం చేశారు. ఔరంగజేబును హీరోగా భావించేవారు ఆయన క్రూరత్వం, ఛాందసవాదంపై జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం చదవాలని ఈ సందర్భంగా సూచించారు. ఔరంగజేబు, బాబర్లను కీర్తించేవారు భారతీయ ముస్లింలను అవమానిస్తున్నట్లేనని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు.





