News

హిందూ దేవాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు

78views

తమిళనాడు శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ తరఫున 210 ప్రకటనలు వెలువడ్డాయి. శాసనసభలో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ డిమాండ్లపై చర్చ జరిగింది. వాటికి మంత్రి పి.కె.శేఖర్‌బాబు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా 210 ప్రకటనలు చేశారు. వాటిలో ముఖ్యమైన కొన్ని..

  • ఈ ఏడాది ఆలయాల తరఫున 4 గ్రాముల బంగారు తాళి సహా రూ.70వేల విలువైన సారె అందించి వెయ్యి జంటలకు వివాహం.
  • ఏకకాల పూజా పథకాన్ని ఈ ఏడాది వెయ్యి ఆలయాలకు విస్తరణ.
  • ఏకకాల పూజ పథకంలో ఇప్పటికే అర్చకులకు ప్రతినెలా అందిస్తున్న ప్రోత్సాహ మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.1,500లకు పెంపు.
  • రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయానికి రూ.15 కోట్ల వ్యయంతో సిబ్బందికి నివాసాలు నిర్మాణం.
  • తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సముద్రపు కోత నుంచి అడ్డుకోవడానికి రూ.30 కోట్ల వ్యయంతో చర్యలు.
  • చెన్నై వడపళనిలోని ఆండవర్‌ ఆలయంలో రూ.1.75 కోట్లతో నిర్మాణాలు. వళ్లి మండపం రూ.1.25 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ.
  • చెన్నై వేళచ్చేరిలోని తండీశ్వరర్‌ ఆలయం వద్ద రూ.3.50 కోట్ల వ్యయంతో అర్చకులు, సిబ్బందికి నివాసాల నిర్మాణం.
  • చెన్నైలోని పళ్లియప్పన్‌ వీధిలోని అరుణాచలేశ్వరర్‌ ఆలయంలో రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులు.
  • తిరువళ్లూర్‌ జిల్లా పూండిలోని ఊండ్రీశ్వరర్‌ ఆలయానికి రూ.కోటి వ్యయంతో ప్రవేశద్వారం, ప్రహరీ నిర్మాణం.
  • తిరువణ్ణామలైలోని బస్టాండు నుంచి అరుణాచలేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఐదు మినీ బస్సుల కొనుగోలు.
  • తిరువళ్లూర్‌ జిల్లా పెరియపాళెయంలోని భవానీ అమ్మవారి ఆలయంలో రూ.14.20 కోట్ల వ్యయంతో వివిధ మండపాలు నిర్మాణం.
  • తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి రూ.57.50 కోట్ల వ్యయంతో ప్రత్యామ్నాయ కొండదారి.
  • రాణిపేట జిల్లా శోళింగర్‌ చిన్నమలైలోని ఆంజనేయ ఆలయానికి కొండదారి నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలన.
  • భక్తులు అధికసంఖ్యలో వచ్చే ఆలయాలకు ప్రతిరోజు గంటపాటు బ్రేక్‌ దర్శన వసతి.