News

విజయవాడ మీదుగా ‘భారత్‌ గౌరవ్‌’ రైలు

66views

పూరి, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే యాత్రికుల కోసం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) విజయవాడ డివిజన్‌ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా ఓ ప్రకటనలో తెలిపారు.

మే ఐదు నుంచి 17వ తేదీ వరకు తొమ్మిది రాత్రిళ్లు, పది పగళ్లు సాగే ఈ యాత్రలో పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్‌ సూర్యదేవాలయం, గయాలోని విష్ణుపాద దేవాలయం, వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలోని సరయు నది వద్ద రామజన్మభూమి, హనుమాన్‌గర్హి, ఆరతి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దర్శనం ఉంటుందన్నారు. ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంలో పాటుగా పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదు పాయం, హోటళ్లలో బస ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి కోచ్‌కు ఎస్కార్ట్‌, టూర్‌ గైడ్‌, టూర్‌ మేనేజర్‌లు అందుబాటులో ఉంటారని తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ఈ పర్యాటక రైలుకు విజయవాడ, ఏలూరు, రాజ మండ్రి, సామర్లకోట, తునిలో బోర్డింగ్‌/డీబోర్డింగ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్యాకేజీ వివరాలు ఇలా..
మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని మేనేజర్‌ రాజా తెలిపారు ఎకానమీ (స్లీపర్‌ క్లాస్‌) పెద్దలకు ఒక్కొక్కరికీ రూ.16,800, పిల్లలకు రూ.15,700, స్టాండర్డ్‌ (3ఏసీ) పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300, కంఫర్ట్‌ (2ఏసీ) పెద్దలకు రూ.34,900, పిల్లలకు రూ.33,300గా పేర్కొన్నారు. టికెట్‌లు బుకింగ్‌ కోసం విజయవాడలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయం లేదా 92814 95848, 89773 14121లో సంప్రదించాల్సిందిగా మేనేజర్‌ రాజా సూచించారు.