News

దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక

286views

దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం.

2008 నవంబర్ 26న 10మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబయికి చేరుకొని.. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్‌ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి.