
కన్నియాకుమారి తోవాలైలో లభ్యమైయ్యే అరుదైన మణిపూసలతో తయారుచేసే మాల, తంజావూర్ జిల్లా కుంభకోణం ‘కొళుందు వెట్రిలై’గా పిలిచే తమలపాకుకు భౌగోళిక గుర్తింపు వచ్చిందని సీనియర్ న్యాయవాది సంజయ్ గాంధీపేర్కొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ, ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులకు భౌగోళిక గుర్తింపు ఇస్తుంటారు.
ఆ రీతిలో రాష్ట్రంలో దిండుగల్ తాళం బుర్ర, సేలం సుంగుడి చీర, కాంచీపురం పట్టు, మదురై మల్లి, తంజావూరు కళాత్మక పల్లెం, శ్రీవిల్లిపుత్తూరు పాలకోవా, కోవిల్పట్టి వేరుశనగ మిఠాయి, పళని పంచామృతం, కొడైకెనాల్ పర్వతాలపై పండించే వెల్లుల్లి, విలాచ్చేరి మట్టిబొమ్మ తదితర రకరకాల ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుంభకోణం తమలపాకు, తోవాలై పూసలమాలకు భౌగోళిక గుర్తింపు వచ్చిందని న్యాయవాది సంజయ్ గాంధీ మంగళవారం మీడియాతో పేర్కొన్నారు.
వ్యవసాయానికి సంబంధించిన కుంభకోణం తమలపాకుకు మొట్టమొదటి సారిగా ఈ గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా వందవాసి చేప, జవ్వాదు చింతపండు, కొల్లిమలై మిరియాలకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.





