News

హిందూదేవాలయ ప్రాంగణాల్లో అన్యమతస్తుల దుకాణాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు

326views

జీవో నంబరు 426పై స్టే కొనసాగుతుందని స్పష్టత
ఈ పిటిషన్ పై ఇప్పటికే 12 సార్లు విచారణ వాయిదా

హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్ట పరిధిలోకి వచ్చే ఆలయాలకు సంబంధించిన దుకాణాల నిర్వహణకు పిలిచే టెండర్లకు సంబంధించిన జీవో నంబరు 426 అమలుపై స్టేను సుప్రీంకోర్టు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.దుకాణాల నిర్వహణ టెండర్లలో హిందూయేతరులు పాల్గొనకూడదని పేర్కొంటూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబరు 426ని సమర్థిస్తూ హైకోర్టు 2019 సెప్టెంబరు 27న తీర్పు చెప్పిం్ది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. దానిని కొనసాగిస్తూ బుధవారం సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును ఎండీ రఫీ సహా కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2020 ఫిబ్రవరి 27న జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పిటిషన్ విచారణ 12సార్లు వాయిదా పడింది.

జీవో అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ దుకాణాల నిర్వహణలో హిందూయేతరులు పాల్గొనకుండా టెండర్లు జారీ చేసి అధికారులు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళారు.పిటిషన్లు దాఖలుచేశారు.శ్రీశైలం, మరికొన్ని ఆలయాల దుకాణాల నిర్వహణకు తాజాగా జారీ చేసిన టెండర్లలో హిందూయేతరులను మినహాయిస్తూ ప్రకటన విడుదల చేసిన విషయంపై క్లారిఫికేషన్‌ పిటిషన్లు దాఖలుచేశారు. దీనిని విచారించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం… 2020 ఫిబ్రవరి 27న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు అది వర్తిస్తుందని స్పష్టం చేసింది.