News

అయోధ్య ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత

187views

అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో బుధవారం లక్నోలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నెల ప్రారంభంలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన పరిస్థితి విషమించడంతో సత్యేంద్రని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చేర్చారు. ఈ క్రమంలోనే వైద్యుల పర్యవేక్షణ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హై డిపెండెన్సీ యూనిట్‌లో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.

20 ఏళ్లకే పూజారిగా..

మహంత్ సత్యేంద్ర దాస్ 20 ఏళ్ల వయస్సులోనే అయోధ్య రామాలయ ప్రధాన పూజారిగా నియమితులయ్యారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాత్కాలికంగా రామాలయ పూజారిగా కూడా సేవలు అందించారు. ఆయన జీవితం ఎప్పటికీ రామ జన్మభూమి, రామ ఆలయంతోనే సంబంధం కల్గి ఉంది. ఈ క్రమంలో రామాలయంలో ప్రధాన పూజారిగా బాధ్యతలు నిర్వహించడంతోపాటు అనేక పనులను నిర్వహించారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సమయంలో కూడా సత్యేంద్ర దాస్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రామాలయం ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరణం పట్ల అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రామాలయం కోసం

రామాలయంలో అనేక సంవత్సరాల పాటు పూజారిగా వ్యవహరించిన మహంత్ సత్యేంద్ర దాస్, అయోధ్య రామాలయ పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పర్యవేక్షణ, సంప్రదింపుల నిర్వహణలో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన ప్రధాన పూజారిగా పనిచేయడంతోపాటు రామ్ లల్లా విగ్రహ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆచార్య సత్యేంద్ర దాస్ అయోధ్య వివాదాన్ని అన్వేషించే 2024 డాక్యుమెంటరీ సిరీస్ “ది బాటిల్ ఆఫ్ అయోధ్య”లో ప్రదర్శించారు. ఈ క్రమంలో అయోధ్యలో అనేక సంవత్సరాలు మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయం కోసం పాటుపడ్డారు.