ArticlesNews

‘డిజిటల్‌ మహాకుంభ్‌’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత

307views

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి జరుగుతున్న కుంభమేళాను ‘డిజిటల్ మహా కుంభ్‌’గా చెప్పుకోవచ్చు. ఈ మహా కుంభమేళాలో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత రైల్వే టిక్కెట్లు మొదలుకొని, డ్రోన్ల ద్వారా నిఘా, ఏఐ పార్కింగ్ వరకు ఉన్న అన్ని సాంకేతికతలను అధికారులు వినియోగిస్తున్నారు.

40 కోట్లకు పైగా జనం వస్తారని అంచనా
ఈ మహా కుంభమేళాకు వచ్చేవారంతా సనాతన సంస్కృతితో పాటు సాంకేతికత శక్తిని కూడా చూడగలుగుతారు. ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్లకు పైగా జనం తరలివస్తారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే భక్తుల భద్రత కోసం వీలైనంత సాంకేతికలను వినియోగిస్తున్నారు. ఇంతవరకు జరిగిన ఏ కుంభమేళాకూ ఇటువంటి సాంకేతికత అందుబాటులోకి రాలేదు. భక్తుల భద్రత దృష్ట్యా, కుంభమేళా జరిగే ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎవరైనా భక్తులు స్నానం చేస్తూ, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతే వారిని లైఫ్ సేవర్ బోట్ ద్వారా రక్షించనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేశారు. భక్తులకు ఉచిత వైఫైతో సహా అనేక హైటెక్ సౌకర్యాలు కల్పించనున్నారు.

క్యూఆర్‌ రైల్వే టికెట్
ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళాకు రైల్వేశాఖ మూడు వేలకు పైగా రైళ్లను నడుపుతోంది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ రైల్వే టికెటింగ్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక విధుల్లో నియమితులైన రైల్వే సిబ్బంది క్యూఆర్‌ కోడ్‌లు కలిగిన జాకెట్లను ధరించనున్నారు. వీటి సాయంతో భక్తులు డిజిటల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు కలర్ కోడెడ్ టిక్కెట్లను జారీ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

స్మార్ట్ కెమెరా నిఘా వ్యవస్థ
మహా కుంభమేళాలో 50 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. ఈ భద్రతా సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చారు. వీరికి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సమయంలో ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించగలిగేలా ఏఐ ఆధారిత సాధనాలు అందించనున్నారు. కుంభమేళా ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. కుంభమేళా ప్రాంతం అంతటా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత డ్రోన్‌లను కూడా వినియోగించనున్నారు.

జన సాంద్రత ఆధారిత హెచ్చరిక వ్యవస్థ
అత్యవసర పరిస్థితుల్లో జనసమూహం అదుపు తప్పకుండా చూసేందుకు జన సాంద్రత ఆధాధిత హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తులు గూగుల్‌ భాగస్వామ్యంతో ఘాట్‌లు, టాయిలెట్లు, ఫుడ్ కోర్టులు మొదలైన వాటిని సెర్చ్‌ చేయవచ్చు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేయడానికి పార్క్+ యాప్‌తో అధికారులు భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఏఐ సాయంతో ప్రభుత్వ పార్కింగ్ స్థలాలలో ఐదు లక్షలకు పైగా వాహనాలను పార్క్ చేయవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లించే సౌకర్యం కూడా ఉంటుంది.

భాషిణి యాప్‌ సాయంతో..
మహా కుంభమేళాలో బహుభాషా చాట్‌బాట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. భక్తులు వారి సొంత భాషలో ఇక్కడ అన్ని వ్యవహారాలు చేసుకోగలుగుతారు. దీనికోసం యూపీ ప్రభుత్వం భాషిణి యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా జాతర ప్రాంతంలో నియమితులైన అధికారులు భక్తుల భాషను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. భాషిణి యాప్ 11 విభిన్న భాషలకు సహకారిగా నిలుస్తుంది.