
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరగనున్న రథసప్తమి వేడుకలకు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, ఎస్పీ మహేశ్వరరెడ్డిలతో కలిసి పర్యటించిన ఆయన ఆలయ ఈవో వై.భద్రాజీకి పలు సూచనలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు. దేవదాయశాఖతో పాటు రెవెన్యూ, పోలీస్, కార్పొరేషన్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక తదితర శాఖాధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ఖాన్, డీఆర్వో వెంకటేశ్వరరావు, ఆలయ ఈవో వై.భద్రాజీ, ఆర్డీవోలు సాయిప్రత్యూష, రమణమూర్తి, జి.వెంకటేష్, ఆర్అండ్బీ ఎస్ఈ జాన్ సుధాకర్, కార్పొరేషన్ కమిషనర్ డి.వి.వి.ప్రసాదరావు, తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.





