News

ఆలయాలు బయటపడటంతో ఆక్రమణల తొలగింపు

386views

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల పురాతన శివాలయం బయటపడింది. ఈ వార్త సంచలనంగా మారడంతో ఈ పురాతన ఆలయం చుట్టుపక్కలగల మైనారిటీ వర్గాల వారు తమ ఇళ్లను కూల్చివేసుకుంటున్నారు.

పురాతన శివాలయం ఆనవాళ్లు వెలుగు చూసిన దరిమిలా జిల్లా యంత్రాంగం ఆ చుట్టుపక్కల గల ఆక్రమణను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇంతలోనే అప్రమత్తమైన స్థానిక మైనారిటీ వర్గాలవారు తమ ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఆక్రమణల పేరుతో జిల్లా అధికారులు తమ ఇళ్లను కూల్చివేసేలోగానే, ఇంటిలోని విలువైన వస్తువులను మరో చోటుకు తరలించి, తమ ఇళ్లను మైనారిటీ వర్గాలవారు కూల్చివేసుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ సంభాల్‌లో విద్యుత్‌ చౌర్యానికి పాల్పడున్న వారిపై దాడులకు ఉపక్రమించింది. ఇటీవలే అక్రమ నిర్మాణం ఆరోపణలపై నోటీసు అందుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ ఇంటిపై విద్యుత్‌ అధికారులు దాడులు చేశారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఇళ్లలో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి రూ.1.3 కోట్ల జరిమానా విధించారు. విద్యుత్‌ అధికారుల దాడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

నవంబర్‌లో సంభాల్‌లోని జుమా మసీదు వద్ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వే నిర్వహించిన సమయంలో జరిగిన హింస, కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు. మొఘల్ పాలనలో హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారనే వాదనల నేపధ్యంలో ఏఎన్‌ఐ సర్వే జరిగింది. అయితే ఇంతలో జిల్లా అధికారులు మసీదుకు కిలోమీటరు దూరంలో ఒక పురాతన ఆలయ ఆనవాళ్లను కనుగొన్నారు. అక్కడ కొన్ని విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో 1978 అల్లర్ల తర్వాత మూతపడిన ఈ ఆలయాన్ని అధికారులు తెరిచాయి. కాగా ఆలయ ప్రాచీనతను నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ చేసే బాధ్యతను సంబంధిత అధికారులు ఏఎస్‌ఐకి అప్పగించారు.