News

భద్రాచలంలో ఈ నెల 31 నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

301views

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ నెల 31 నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఈవో రమాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.జనవరి 10న ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారదర్శనం పూజ ఉంటుందని తెలిపారు.

పూజలో పాల్గొనేందుకు దాదాపు 4 వేల మందికి అవకాశం ఉంటుందని తెలిపారు. రూ.2 వేలు, రూ.1,000, రూ.500, రూ.250 టికెట్ల కోసం https://bhadradritemple.telangana.gov.in లో పొందవచ్చని వివరించారు.

ప్రత్యక్షంగా రాలేని భక్తుల సౌకర్యార్థం పరోక్ష సేవలనూ అందుబాటులోకి తెచ్చినట్లు ఈవో తెలిపారు. పరోక్ష పూజా టికెట్‌లను ఆన్‌లైన్‌తో పాటు, దేవాలయం వద్ద ఆఫ్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు అని తెలిపారు. వెబ్‌సైట్‌లో టికెట్లు తీసుకున్న వారు ఒరిజినల్‌ టికెట్లను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10న ఉదయం 5 గంటల వరకు రామాలయ కార్యాలయంలో తీసుకోవాల్సి ఉంటుందన్నారు.