
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మొదటి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. సమావేశం అనంతరం టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో 20,30గంటల పాటు వేచి ఉండాల్సిన దర్శనాన్ని రెండు, మూడుగంటల్లోపే పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తామన్నారు. టిటిడిలో పనిచేస్తున్న అన్యమతస్తులను వి.ఆర్ లేకుంటే ప్రభుత్వ శాఖలకు పంపిస్తామన్నారు.
మూడు,నాలుగు నెలల్లో తిరుమలలోని డంపింగ్ యార్డును తరలిస్తామని..శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పేరును గరుడవారధిగా మారుస్తున్నామన్నారు. అలిపిరి సమీపంలో కొండకు సమీపంలో నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్ పనులు వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని..హిందువుల మనోభాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ముంతాజ్ హోటల్ నిర్మాణం జరగడం సమంజసం కాదన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని..మాట్లాడితే కేసులు పెడతామన్నారు. ప్రతి నెలలో మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పిస్తామని..శ్రీవాణి ట్రస్టు పేరును రద్దు చేసి..నేరుగా టిటిడి అకౌంట్ లోకి డబ్బులు జమయ్యేలా చేస్తామన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన బ్రహ్మోత్సవ బహుమానంను 17,400కు పెంచుతున్నామని..అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 7,530కి పెంచుతున్నామన్నారు. అలాగే తిరుమలలో శారదాపీఠం నిర్మించిన మఠాన్ని పూర్తిగా కూల్చేస్తామని..టిటిడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్నారు.పర్యాటకశాఖకు కేటాయించే దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తామన్నారు.





