ArticlesNews

బలవంతపు మతమార్పిడులు, వసూళ్ళు, వేధింపుల పాస్టర్ అరెస్ట్

398views

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసులు డేవిడ్ రాజారెడ్డి అనే పాస్టర్‌ను బలభద్రపురం గ్రామంలో అరెస్ట్ చేసారు. డేవిడ్ మీద బలవంతపు మతమార్పిడులు, డబ్బుల వసూళ్ళు, వేధింపుల ఆరోపణలు చాలా ఉన్నాయి.

నక్కా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు పాస్టర్ డేవిడ్‌ను మంగళవారం నాడు అరెస్ట్ చేసారు. క్రైస్తవ మతంలోకి మారడానికి తను ఒప్పుకోలేదని, ఆ కారణంతో తనను డేవిడ్ తీవ్రంగా వేధించాడనీ నక్కా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం, పాస్టర్ డేవిడ్ తనను చర్చి ఫండ్‌ కోసం లక్ష రూపాయలు అడిగాడని, అది ఇవ్వనందుకు తనను బెదిరించాడనీ నక్కా శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బిక్కవోలులో శ్రీనివాస్ ఇంటి ఎదురుగా ఉన్న భవనంలో పాస్టర్ డేవిడ్ చర్చి నడుపుతున్నాడు. అక్కడ లౌడ్‌స్పీకర్లు పెట్టి పెద్ద సౌండ్‌తో క్రైస్తవ ప్రార్థనలు, గీతాలు ప్రసారం చేయడం ద్వారా వేధించేవాడని, ఆ ధ్వనికి తమ కుటుంబం మొత్తం చాలా అసౌకర్యానికి, ఒత్తిడికీ లోనయ్యేదని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పాస్టర్ డేవిడ్ తనను పదేపదే క్రైస్తవంలోకి మతం మారాలంటూ ఒత్తిడి చేసేవాడని శ్రీనివాస్ చెప్పాడు. తను ఎన్నిసార్లు నిరాకరించినా వదలకుండా, తనపై ఒత్తిడి చేసేవాడని వివరించాడు. మతం మారనందుకు తనమీద కక్ష కట్టిన పాస్టర్ డేవిడ్ తనగురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆవేదన చెందాడు. గంజాయి వ్యాపారం, లైంగిక వేధింపుల వంటి అక్రమ కార్యకలాపాల్లో తను పాల్గొంటున్నట్లు తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించేవాడని శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చర్చిలో కూటములు జరిగినప్పుడు వచ్చే వాహనాలన్నీ తన స్థలంలోనే తన ఇంటికి అడ్డంగా పెట్టి, తమను కదలనివ్వకుండా నిర్బంధించేవారని ఆరోపించాడు.

పాస్టర్ డేవిడ్ చర్యల వల్ల తన కుటుంబంలో కలతలు చెలరేగాయనీ, తన భార్య తననుంచి విడిపోయిందనీ శ్రీనివాస్ వాపోయాడు. పోలీసులు భారతీయ న్యాయ సురక్షా సంహిత సెక్షన్ల కింద పాస్టర్ డేవిడ్ మీద కేసు నమోదు చేసారు.

ఇందులో గమనించాల్సిన విశేషమేంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు మతమార్పిడులపై చట్టపరమైన చర్య తీసుకున్న మొదటి కేసు ఇదే. అనధికారికంగా మతమార్పిడులు చేయడం, మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. పాస్టర్ రాజారెడ్డి కార్యకలాపాలు, వాటివల్ల స్థానికంగా ప్రజల మీద పడుతున్న ప్రభావం వంటి విషయాలపై దర్యాప్తు జరుగుతోంది.

బిక్కవోలు పోలీసులు పాస్టర్ రాజారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించిందని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ వెల్లడించింది.