News

హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు

294views

కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్‌ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్‌ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.