
మహాకుంభ మేళాలో హిందుయేతరులకు దుకాణాలు ఇవ్వమన్న అఖారా పరిషత్ వ్యాఖ్యలను ప్రవచనకారుడు పండిత్ ధీరేంద్ర శాస్త్రి సమర్థించారు. ఇది సరైన నిర్ణయమన్నారు. అఖారా పరిషత్ డిమాండ్ చాలా బాగుందని, రాముడ్ని విశ్వసించని వారికి రాముడి కార్యంతో పనేమిటని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై, పూజా విధానాలపై, పదార్థాల స్వచ్ఛతపై అవగాహన, భక్తి వున్న వారికే దుకాణాలు ఇవ్వాలన్నారు. వీటిపై అవగాహన లేనివారుంటే కచ్చితంగా నాశనం చేస్తారన్నారు. అందుకే మహాకుంభ లోకి హిందుయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని తెలిపారు. చత్తీస్ గఢ్ లోని కవార్ధాలో బాలాజీ హనుమాన్ భూమి పూజ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మహాకుంభ మేళా పవిత్రతను కాపాడే విషయంలో అఖిల భారతీయ అఖారా పరిషత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. హిందువులు మినహా మిగతా వారెవ్వరికీ స్టాల్స్ పెట్టనివ్వకుండా నిషేధించింది. ఈ మేరకు కుంభమేళా 2025 నేపథ్యంలో పలు నిబంధనలను ప్రకటించింది. హిందువులు కాని వారు స్టాల్స్ ఏర్పాటు చేయడాన్ని అఖారా నిషేధించింది. అలాగే కుంభమేళా ఆవరణలోకి వచ్చే పండితులు, స్వామీజలు తప్పకుండా తమ ఐడీ ప్రూఫులను చూపించాలని కూడా అఖారా నిబంధన పెట్టింది. నకిలీ స్వామీజీలు, బాబాలను అరికట్టేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ఇటీవలే ప్రయాగరాజ్ లో నిరంజని అఖాడా ప్రధాన కార్యాలయంల అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని, అదే సమయంలో సనాతన ధర్మాన్ని కించపరిచే శక్తులు కూడా విజృంభిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత తమపై వుందని, అలాగే భద్రతా బలగాలకు సహకరించాల్సిన బాధ్యత కూడా తమపై వుందన్నారు. అందుకే కుంభమేళాకి వచ్చే సాధు సంతులకు కచ్చితంగా ఆధార్ లేదా ఐడీ వుండాలన్న నిబంధన తెచ్చామన్నారు. నకిలీ బాబాలను అరికట్టేందుకు అన్ని అఖాడాల నుంచి సాధువుల జాబితాను తాము అడిగామని మహంత్ రవీంద్ర తెలిపారు.





